ఇండిగో కన్నా పాన్షాప్ యాపారం మేలు
ప్రముఖ విమానయాన సంస్థ, టాప్ మార్కెట్ షేర్ కలిగిన ఇండిగోలో ప్రమోటర్ల మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. ఇండిగో కంటే పాన్ షాప్ వ్యాపారి మరింత మెరుగ్గా బిజినెస్ను నడిపించగలడు అంటూ ఇండిగోలో 37 శాతం వాటా కలిగిన రాకేష్ గంగ్వల్ ఆరోపించారు. సంస్థలో అంతర్గతంగా జరుగుతున్న అనేక అంశాలను ఆయన బయటి ప్రపంచానికి వెల్లడించడంతో పాటు ఏకంగా సెబీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఇంతకాలం లోలోపల నడుస్తున్న ప్రమోటర్ల గొడవ ఇప్పుడు రోడ్డున పడింది. దీంతో స్టాక్ ఏకంగా 15 శాతం పడిపోయింది. దేశంలో మరో బోర్డ్ రూమ్ యుద్ధం కార్పొరేట్ ప్రపంచాన్ని, స్టాక్ మార్కెట్నూ కుదిపేస్తోంది.
పన్ను ప్లానింగ్ లో జీవిత బీమా ఎంత కీలకమో తెలుసా!
భాగస్వాముల మధ్య విబేధాలు
ఇండిగో సంస్థలో రాకేష్ గంగ్వల్కు 37 శాతం, మరో ప్రమోటర్ అయిన రాహుల్ భాటియాకు 38 శాతం ఉంది. వీళ్లద్దరి మధ్యా గత కొద్దికాలం నుంచి విబేధాలు ఉన్నాయి. ఇద్దరికీ మాటా మాటా పెరుగుతూ అవి అప్పుడప్పుడూ బయటకు పొక్కుతున్నాయి. ఇద్దరి మధ్య కుదుర్చుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా రాహుల్ భాటియా ఇండిగోపై అతి పెత్తనాన్ని ప్రదర్శిస్తున్నారని, స్వతంత్ర డైరెక్టర్లు లేకపోవడం కూడా పారదర్శకతపై అనేక అనుమానాలకు తావిస్తోందంటూ గంగ్వల్ సెబీకి లేఖ రాశారు. ఈ అంశాన్ని తక్షణమే పరిశీలించాలని కూడా కోరారు. కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యలు ఉన్నాయంటూ సాక్షాత్తూ ప్రమోటర్ బయటకు వచ్చి చెప్పడంతో ఇండిగో స్టాక్ కుప్పకూలింది. ఇదే అంశాన్ని ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు, పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరీ, విమానయాన నియంత్రణా సంస్థ అధిపతి అరుణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.
లోగుట్టు చాలానే ఉంది
గంగ్వల్ చెబ్తున్న దాని ప్రకారం రాహుల్ అనేక చిన్న కంపెనీలను ఏర్పాటు చేసి వాటిని ఇండిగోతో లింక్ చేసి వ్యాపారాలు చేస్తున్నారని, ప్రత్యక్షంగా ఆయన లాభపడ్తూ ఇండిగోకు నష్టం తెస్తున్నారు. ఆడిట్ కమిటి అనుమతి లేకుండా, బిడ్లను పిలవకుండా థర్ట్ పార్టీ లావాదేవీలను నిర్వహించారు.
చాలా ట్రాన్సాక్షన్స్ పాటు డేట్లతో నిర్వహించారు.
ఇండిగో సంస్థకు చెందిన వాణిజ్య స్థలాలను రాహుల్కు చెందిన ఐజీఈ గ్రూపు సంస్థలకు చవకగా లీజ్కు ఇచ్చారు. ఏడాదికి ఏడాది లీజ్ పెరగకపోగా, వాటిని 25 శాతం తక్కువకు ఇస్తున్నారు.
ఎమర్జెన్సీ జనరల్ మీటింగ్కు బోర్డు అనుమతినివ్వట్లేదు.
సెబీ గవర్నెన్స్ నిబంధనలను, కోడ్ ఆఫ్ కాండక్ట్ను తుంగలో తొక్కుతున్నారు.
రాహుల్ భాటియా వాదన
గంగ్వల్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. ఇవి దురుద్దేశంతో, తప్పుదోవ పట్టించేవిలా ఉన్నాయి.
ఐజీఈ గ్రూపు పరువు తీయడానికే ఇలా చేస్తున్నారు.
సంస్థలో పట్టును పెంచుకోవడానికి గంగ్వల్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.
13 ఏళ్లుగా కనపడని తప్పులు ఇప్పుడే ఎందుకు కనిపిస్తున్నాయి.
ఐజీఈ- ఇండిగో మధ్య లావాదేవీల విలువ టర్నోవర్లో ఒక్క శాతానికి కూడా మించవు.
ఎవరి వాదన ఎలా ఉన్నా ఇండిగో షేర్ ఈ రోజు కుప్పకూలింది. ఇంట్రాడేలో ఈ స్టాక్ రూ.1265 వరకూ వెళ్లింది. ఈ దెబ్బకు కాంపిటీటర్ అయిన స్పైస్ జెట్ స్టాక్ 4 శాతం లాభపడింది.