దేశవ్యాప్తంగా లక్షమంది కస్టమర్లతో SBI మెగా కస్టమర్ మీట్
ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ నెల 28వ తేదీన (మంగళవారం) 'మెగా కస్టమర్ మీట్'ను నిర్వహిస్తోంది. అంటే దేశంలోని పలు ఎస్బీఐ బ్యాంకుల్లో ఆయా బ్రాంచీల్లోని కస్టమర్లతో భేటీ కానుంది. తద్వారా తమ కస్టమర్ల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించింది.
రూ.300 ఇన్వెస్ట్తో కోటీశ్వరులు కావొచ్చు!
500 ప్రాంతాల్లోని LHOs ద్వారా
దేశంలోని 500 ప్రాంతాల్లో ఉన్న లోకల్ హెడ్ ఆఫీస్ (LHOs)ల ద్వారా లక్షమంది కస్టమర్లతో ఎస్బీఐ సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశానికి సీనియర్ అధికారులు హాజరవుతారు. కస్టమర్లకు ఉన్న సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకు ఈ మెగా కస్టమర్ మీట్ ఉపయోగపడుతుంది. వారి సూచనలు, సలహాలతో మెరుగైన సేవలు అందించేందుకు కూడా తోడ్పడుతుందని భావిస్తున్నారు.
సమస్యలు చెప్పవచ్చు, సూచనలు ఇవ్వొచ్చు
ఎస్బీఐ పదిహేడు లోకల్ హెడ్ ఆఫీసుల ద్వారా జాతీయస్థాయి కస్టమర్ మీట్ నిర్వహిస్తోంది. బ్యాంకుల్లోని సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు. కస్టమర్లు ఈ సమావేశానికి హాజరై బ్యాంకు సిబ్బందితో సమస్యలను చెప్పుకోవచ్చు. అవసరమైతే నేరుగా ఉన్నత అధికారులను కలిసి సమస్యలు వివరించే వెసులుబాటు ఉంటుంది.
కస్టమర్లలో విశ్వాసం పెంచడమే లక్ష్యం
క్షేత్రస్థాయిలో బ్యాంకు ఉన్నతాధికారులు అందుబాటులో ఉండటం ద్వారా తమ కస్టమర్ల విశ్వాసం పెంపొందించడం ఈ సమావేశం మరో ముఖ్య ఉద్దేశ్యమని, కస్టమర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని భావిస్తున్నామని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకు సేవలు, పథకాలపై ఏ సమస్యలు ఉన్నా ఫిర్యాదులు చేయవచ్చునని, ఫీడ్ బ్యాక్, సలహాలు ఇవ్వవచ్చునని పేర్కొంది. అంతేకాకుండా, ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ మార్గాలతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ అండ్ లైఫ్ స్టయిల్ ప్లాట్ ఫాం యోనో ఎస్బీఐ గురించి కస్టమర్లకు అవగాహన కల్పించనున్నారు. యోనోను నవంబర్ 2017లో లాంచ్ చేశారు. దీనిని ఇప్పటి వరకు 2 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. చాలామంది డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.