నరేంద్ర మోడీ ఎఫెక్ట్: ఒక్క నిమిషంలో 3.18 లక్షల కోట్లు సంపాదించారు
ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని వెల్లడైంది. మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కానున్నారు. దీంతో సోమవారం నాటి స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు ముందు ఏ పార్టీకి లేదా ఏ కూటమికి మెజార్టీ రాదని, ఫ్రంట్ వస్తుందని భావించారు. దీంతో మార్కెట్లో అనిశ్చితి కనిపించింది. కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీజేపీ వైపు మొగ్గు చూపాయి. దీంతో మార్కెట్లు జోరందుకున్నాయి.
ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 900 పాయింట్లు పెరిగింది. అంటే ఎంత దూకుడు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చినప్పుడే మార్కెట్ల్ జోష్ పెరుగుతుందని నిపుణులు భావించారు. ఉదయం 9.26 సమయంలో సెన్సెక్స్ 720 పాయింట్స్ పెరిగి 38,650 వద్ద, నిఫ్టీ 211 పాయింట్స్ పెరిగి 11,619 వద్ద ట్రేడ్ అయ్యాయి.
నిమిషంలో రూ.3.18 లక్షల కోట్లు సంపాదించారు
మోడీ రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్నారని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడి కావడంతో దేశీయ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. దీంతో మదుపర్ల సంపద ఊహించని విధంగా పెరిగింది. కేవలం మార్కెట్ ప్రారంభమైన ఒకే ఒక్క నిమిషంలో మదుపర్లు రూ.3.18 లక్షల కోట్లు ఆర్జించారు. మార్కెట్ ఆరంభమైన 60 సెకన్లలోనే బీఎస్ఈలోని అన్ని కంపెనీల మార్కెట్ విలువ మొత్తంగా రూ.3.18 లక్షలు పెరిగి రూ.1,49,76,896 కోట్లకు చేరుకుంది. శుక్రవారం నాటి ముగింపులో ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.1,46,58,710 కోట్లుగా ఉంది.
బలపడుతున్న రూపాయి
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా కాస్త బలపడుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 70.36తో ఓపెన్ అయింది. ఆ తర్వాత బలపడి 69.44 వద్ద కొనసాగింది. డాలర్తో 79 పైసలు లాభపడింది. మే 17వ తేదీన రూపాయి 70.23 పైసల వద్ద ముగిసింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, మోడీ తిరిగి ప్రధాని అవుతారని తేలడంతో రూపాయి గత డిసెంబర్ నుంచి అత్యధిక లాభం ఇదే.
మరోవైపు, ఇరాన్ సంక్షోభం ముదరడంతో చమురు ధరలు ఒక శాతం పెరిగాయి. సౌదీ చమురు శాఖ మంత్రి ఖలీద్ అల్ ఫలీహ్ మాట్లాడుతూ... చమురు ఉత్పత్తిని పరిమిత చేస్తామన్నారు. ఇది మార్కెట్లపై ప్రభావం చూపింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్కు చెందిన నిక్కీ 0.34 శాతం పెరగ్గా, దక్షిణ కొరియా సూచీలు 0.57 శాతం పెరిగాయి.