జెట్ విక్రయంలో మరో ముందడుగు.. 14వేల కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన డార్విన్ గ్రూప్..
ముంబై : పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ విక్రయంలో మరో అడుగు ముందుకుపడింది. సంస్థ కొనుగోలుకు ఆసక్తి చూపించిన డార్విన్ గ్రూప్ ఎస్బీఐతో భేటీ అయింది. జెట్ ఎయిర్వేస్ను అప్పులతో సహా సొంతం చేసుకునేందుకు ఆ కంపెనీ రూ.14వేల కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని డార్విన్ గ్రూప్ సీఈఓ రాహుల్ గన్పులే ప్రకటించారు.

బిడ్ దాఖలు చేసిన డార్విన్ గ్రూప్
డార్విన్ గ్రూపు ఇప్పటికే ఆయిల్ అండ్ గ్యాస్, హాస్పిటాలిటీ, రియల్టీ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది. తాజాగా జెట్ ఎయిర్ వేస్ కొనుగోలు కోసం ఫైనాన్షియల్ బిడ్ దాఖలుకు సిద్ధమైంది. అయితే ఫైనాన్షియల్ బిడ్ సమర్పించే ముందు మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఎస్బీఐ క్యాప్తో భేటీ అయినట్లు కంపెనీ ప్రకటించింది. ఒప్పందంలో భాగంగా జెట్ ఎయిర్వేస్ అప్పులన్నీ చెల్లిస్తామని, కొనుగోలుకు అవసరమైన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకుంటామని తెలిపింది.

విక్రయానికి 75శాతం వాటా
జెట్ ఎయిర్వేస్కు ఎస్బీఐ కన్సార్టియం 8వేల కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వగా.. తిరిగి చెల్లించకపోవడంతో వాటిని ఈ క్విటీగా మార్చుకుంది. అనంతరం జెట్ ఎయిర్వేస్లో 75శాతం వాటాను ఎస్బీఐ క్యాప్స్ ద్వారా అమ్మకానికి ఉంచింది. కంపెనీలో ప్రస్తుతం 24 శాతం కలిగిన ఎతిహాద్తో పాటు మరో రెండు కంపెనీల నుంచి బిడ్లు రాగా.. కొనుగోలు కోసం ఎతిహాద్ పలు షరతులు విధించింది.

ఏవియేషన్పై హిందుజాల ఆసక్తి?
దాదాపు పది రంగాల్లో వ్యాపారం కలిసిన హిందూజాలు ఏవియేషన్ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు గతంలో ఆసక్తి చూపింది. 2001లో ఎయిరిండియాలో 40శాతం వాటా విక్రయించాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు హిందూజా గ్రూపు బిడ్ దాఖలు చేసింది. ఇండియన్ ఎయిర్లైన్స్లోనూ 26శాతం వాటా కొనుగోలు కోసం అశోక్ లేలాండ్, హిందూజా ఫైనాన్స్ కార్పొరేషన్తో పాటు మాకెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బిడ్లు వేశాయి. ఇటీవల ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా హిందూజా గ్రూప్ ఆసక్తి కనబరిచింది.

హిందుజాలను ఒప్పించే ప్రయత్నం
జెట్ ఎయిర్వేస్ రుణ దాతలతో పాటు ఎతిహాద్ సంస్థ హిందూజా గ్రూపును సంప్రదించినట్లు సమాచారం. జెట్ ఎయిర్వేస్లో పెట్టుబడులు పెట్టాలని ఆ కంపెనీని కోరినట్లు తెలుస్తోంది. తొలుత హిందుజా గ్రూపు వ్యవహారాలు చూసే జేపీ హిందుజాను సంప్రదించగా... తమ్ముడు అశోక్ హిందూజాను సంప్రదించిమని సూచించారు. అయితే ఇద్దరు సోదరులు జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.

వాటా విక్రయాల ప్రయత్నం
జెట్ ఎయిర్వేస్ ఏప్రిల్ 17 నుంచి కార్యకలాపాలు నిలిపివేసింది. దీంతో కంపెనీలో 75 శాతం వాటాను విక్రయించేందుకు ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం ప్రయత్నిస్తోంది. ఏప్రిల్ 8 నుంచి 12 వరకు నాలుగు సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లుదాఖలు చేయగా.. వాటిలో డార్విన్ గ్రూప్ లేదు. అయితే ఫైనాన్షియల్ బిడ్ల దాఖలుకు గడువైన ఈ నెల 10న ఎతిహాద్ ఎయిర్వేస్తో పాటు కొన్ని కొత్త సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. 13న వాటిని పరిశీలించిన బ్యాంకర్లు డార్విన్ గ్రూప్ సీఈఓతో భేటీ అయ్యారు. ఈ సమావేశంతో ఆయన జెట్ కొనుగోలుకు రూ.14వేల కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది.


Click it and Unblock the Notifications