క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం: ద్రవ్యోల్భణంపై బ్యాడ్ న్యూస్, రూపాయి లాభపడ్డా దెబ్బ!
ముంబై: చమురు ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు గత కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి. గురువారం మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర కాస్త తగ్గినప్పటికీ, గత ఐదు నెలలతో పోలిస్తే వీటి ధరలు పెరిగాయి. ఇది భారత్ ద్రవ్యోల్భణ అంచనాలకు ఆందోళకరం. క్రూడ్ ఆయిల్ ధరలు గత ఐదు నెలలతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2సార్లు రేట్ కట్ చేసిది. ఫిబ్రవరిలో ఓసారి, ఏప్రిల్ 4న మరోసారి 0.25 శాతం చొప్పున రెండుసార్లు మొత్తం 0.5 శాతం రెపో రేటును తగ్గించింది. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు దీనిని ప్రకటించారు.
మొబైల్ నెంబర్ లేకుండా ఆధార్ కార్డు వివరాలు ఎలా మార్చుకోవాలి?
క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల సవాల్
ఇటీవల క్రూడ్ ఆయిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయని, ఇది ఆర్థిక వృద్ధికి, ద్రవ్యోల్భణానికి.. రెండింటికి కూడా పెద్ద సవాల్ అని ముంబైకి చెందిన క్రిసిల్ లిమిటెడ్ చీఫ్ ఎకనమిస్ట్ జోషి తెలిపారు. బ్రెంట్ ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అయితే, ఇటీవలి కాలంలో దీని ఉత్పత్తి తగ్గింది. అలాగే, అమెరికా - చైనా ట్రేడ్ వార్ కారణంగా దీని ధరలు మరింతగా పెరుగుతాయని ఆర్బీఐ భావిస్తోంది. అయితే ఈ సమస్య పరిష్కారం కాగలదని ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ ముగిసే అవకాశముంది. నెక్స్ట్ మంత్లో మరోసారి చర్చలు జరగనున్నాయి.
రూపాయిపై చమురు ధరల పెరుగుదల ప్రభావం
ఒక బ్యారెల్ ఆయిల్ ధర 65 డాలర్లు ఉండగా, అది 10 డాలర్లు పెరిగిన సమయంలో ద్రవ్యోల్భణం 49 బేసిస్ పాయింట్లు పెరిగినట్లు ఇటీవలి సెంట్రల్ బ్యాంక్ అధ్యయనంలో తేలింది. అదే సమయంలో బ్యారెల్ ధర 55 డాలర్లకు తగ్గితే ద్రవ్యోల్భణం 58 బేసిస్ పాయింట్స్ అధిగమిస్తుందని తేలింది. ఆయిల్ ఛార్జీల ప్రభావం రూపాయి పైన కూడా ఉంటుంది. మార్చి నెలలో డాలర్ మారకం విలువపై రూపాయి 2.3 శాతం పెరిగింది. గత నెలలో ఆసియాలోనే ఇది అత్యుత్తమ పర్ఫార్మర్గా నిలిచింది. అక్టోబర్ నెల కంటే ఇది ఏడు శాతం ఎక్కువ. రూపాయి విలువ పెరుగుదల ద్రవ్యోల్భణాన్ని సులభతరం చేస్తుంది. కానీ చమురు ప్రభావం రూపాయి పైన పడుతోందని చెబుతున్నారు.
క్రూడ్ ఆయిల్ ధర పెరగడానికి కారణాలు
ఇటీవల చమురు ధరలు భగ్గుమన్నాయి. లిబియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు ఇంధన ధరలు ఎగబాకడానికి పరోక్షంగా కారణమయ్యాయి. ఇప్పటికే ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నట్లు ప్రకటించగా, ఇరాన్, వెనిజులా దేశాలకు చెందిన చమురును కొనుగోలు చేయవద్దని అమెరికా ఆదేశాలు ధరలపై ఒత్తిడిని పెంచింది. దీంతో క్రూడ్ ఆయిల్ ధర అయిదు నెలల గరిష్ఠానికి తాకింది. మంగళవారం బ్యారెల్ క్రూడాయిల్ ధర 71.34 డాలర్లకు చేరుకున్నది. గతేడాది నవంబర్ తర్వాత ఇంధనానికి ఇదే గరిష్ఠ స్థాయి ధర. నవంబర్ 2018లో బ్యారెల్ ధర 64.77గా ఉంది. ఉత్పత్తిలో కోత విధించనున్నట్లు ఒపెక్ దేశాలు ప్రకటించడంతో ఈఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇంధన ధరలు ముప్పై శాతం వరకు పెరిగాయి. మరోవైపు పలు దేశాల ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉన్నట్లు సంకేతాలు రావడం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఒపెక్లో సభ్యత్వం కలిగిన లిబియా ప్రతిరోజు పది లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ను సరఫరా చేస్తోంది.