మొదటిసారి 39వేల పాయింట్లపైన ముగిసిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లో కొనుగోళ్ల జోరుకు ఇప్పట్లో కళ్లెం పడేలా లేదు. సెన్సెక్స్, నిఫ్టీ మరోసారి లాభాల బాటలో పయనించాయి. సెన్సెక్స్ మొట్టమొదటిసారి 39 వేల పాయింట్లకు పైన ముగిసి ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. నిఫ్టీ కూడా మరోసారి 11700 పాయింట్లపైన పటిష్టంగా ముగిసింది. ఆటో, ఐటీ, బ్యాంకింగ్, రియాల్టీ రంగ కౌంటర్ల నుంచి వచ్చిన కొనుగోళ్ల మద్దతు నేపధ్యంలో ఈ జోరు కొనసాగింది. పీఎస్యూ బ్యాంక్స్, ఫైనాన్షియల్ రంగ కౌంటర్లకు పటిష్టమైన బయింగ్ సపోర్ట్ లభించింది. చివరకు సెన్సెక్స్ 185 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 39056 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 44 పాయింట్ లాభంతో 11700పైన ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 30354 దగ్గర స్థిరపడింది.
ట్విస్ట్: టెక్నాలజీ వల్ల 4.5 కోట్ల ఉద్యోగాలు పోతాయి, 6.5 కోట్ల ఉద్యోగాలు వస్తాయి
6 నెలల గరిష్టానికి టాటా మోటార్స్
వరుస నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న టాటా మోటార్స్ షేర్ ఎట్టకేలకు ఆరు నెలల గరిష్టానికి చేరింది. వరుసగా నాలుగో రోజు కూడా లాభాల్లో ముగియడం కొద్దిగా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతోంది. ఈ రోజు కూడా ఈ స్టాక్ 9 శాతం వరకూ పెరిగింది. చాలా కాలం తర్వాత 200పైన ముగిసింది. ఈ స్టాక్ ఈ రోజు రూ.203 దగ్గర క్లోజైంది.
రాయల్ ఎన్ఫీల్డ్కు దాసరి పుష్
ఐషర్ మోటార్స్ సంస్థలో వినోద్ దాసరి సీఈఓగా చేరడం మరింత నమ్మకాన్ని పెంచింది. అయితే సిద్ధార్థ్ లాల్ ఐషర్లో ఎండీగానే కొనసాగబోతున్నారు. అశోక్ లేల్యాండ్లో తన సత్తా చూపిన వినోద్ దాసరి ఈ మధ్యే రాజీనామా చేసి కొంతకాలం బ్రేక్ తర్వాత ఐషర్ మోటార్స్లోకి వచ్చారు. దీంతో నాలుగు రోజుల వరుస నష్టాలకు కొద్దిగా బ్రేక్ పడి ఈ స్టాక్ కోలుకుంది. 1.7 శాతం పెరిగి స్టాక్ రూ.20581 దగ్గర క్లోజైంది.
గోద్రెజ్ ఇళ్లకు ఫుల్ గిరాకీ
గోద్రెజ్ ప్రాపర్టీస్ స్టాక్ వరుసగా రెండో రోజు కూడా లాభాల్లో ముగిసింది. స్టాక్ రూ.900కు చేరువవుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక బుకింగ్స్ నమోదైనట్టు గోద్రెజ్ వెల్లడించింది. రూ.2100 కోట్ల విలువైన 2900 ఇళ్లను అమ్మినట్టు సంస్థ తెలిపింది. ట్రేడింగ్ వాల్యూమ్ కూడా తొమ్మిది రెట్లు పెరిగింది. చివరకు స్టాక్ 9.7 శాతం పెరిగి రూ.891.50 దగ్గర క్లోజైంది.
సైయెంట్కు సడన్ షాక్
హైదరాబాద్కు చెందిన ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయెంట్ స్టాక్ ఈ రోజు ఏకంగా 10 శాతానికిపైగా పతనమైంది. డిజైన్ ఆధారిత మ్యానుఫ్యాక్చరింగ్ ఆదాయం ఈ సారి గణనీయంగా పడిపోవచ్చని సైయెంట్ వెల్లడించింది. ఒక కస్టమర్కు చెందిన 5 మిలియన్ డాలర్ల ఆర్డర్ బాగా ఆలస్యం కావొచ్చని సైయెంట్ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. అయితే ఇలాంటి పరిణామాల వల్ల మార్జిన్లపై పెద్దగా ప్రభావం ఉండబోదని సైయెంట్ చెబ్తోంది. అయినా స్టాక్ మాత్రం 11 శాతం పతనమై రూ.580 దగ్గర క్లోజైంది.
52 వారాల గరిష్టానికి 20 స్టాక్స్
మార్కెట్తో పాటు కొన్ని స్టాక్స్ 52 వారాల గరిష్టానికి చేరుకుంటున్నాయి. వాటల్లో ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇండియన్ హోటల్స్, మెర్క్, పిఐ ఇండస్ట్రీస్, పంజాబ్ కెమికల్స్, వరుణ్ బెవరేజెస్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ స్టాక్స్ ఉన్నాయి.
అలానే ఈ మధ్య బాగా పెరిగిన స్టాక్స్లో కొద్దిగా లాభాల స్వీకరణ నమోదైంది. వాటిల్లో ఎన్సిసి, ఫెడరల్ మొగల్, దీపక్ ఫర్టిలైజర్స్, ఎల్ టి ఫుడ్స్ వంటివి ఉన్నాయి.
క్రూడ్ ఎఫెక్ట్
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు నాలుగు నెలల గరిష్టానికి చేరడంతో దేశీయంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాల బాట పట్టాయి. హెచ్ పి సి ఎల్ 3.3 శాతం, బిపిసిఎల్ 2.9 శాతం నష్టపోయాయి.