ఎవరికి ఓటు వేయాలో చెప్పిన రఘురాం రాజన్!: ఉద్యోగాలు, జీడీపీపై ఏం చెప్పారంటే?
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ 'థర్డ్ పిల్లర్' పేరుతో ఓ పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన వివిధ ఇంటర్వ్యూలలో మాట్లాడారు. నిరుద్యోగం దేశానికి ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. మంచి ఉద్యోగాల కోసం ఎంతోమంది క్యూలో ఉన్నారని, చాలా ఏళ్లుగా ఉద్యోగ సంతృప్తి లేదన్నారు. భారత అంతర్గత ఎకానమీ గ్రోత్ ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
ఈ యాప్ను వాడుతున్నారా, జాగ్రత్త: హెచ్డీఎఫ్సి వార్నింగ్
ఎవరికి ఓటు వేయాలంటే
చైనా మొదట తమ దేశ ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించిందని, ఇప్పుడు ఆర్మీ, డిఫెన్స్ సిస్టంలోను ముందుంజలో ఉందని రఘురాం రాజన్ పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలపడటం ముఖ్యమని, దానిపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. తద్వారా 2019 ఎన్నికల్లో బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మించే వారికి మద్దతివ్వాలని భావించారు. భారత్ వృద్ధి రేటు 7 శాతం ఉందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆర్థికవేత్తల సాయంతో జీడీపీ డేటాపై ఉన్న అనిశ్చితిని తొలగించాలన్నారు. భారత్కు అత్యంత ఆందోళనకర విషయం నిరుద్యోగం అన్నారు. జాబ్ డేటా బయటపెట్టాలన్నారు. నోట్ల రద్దు వంటి అంశాలపై ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలన్నారు.
నిరుద్యోగం భారత్కు ఆందోళన
90 వేల రైల్వే ఉద్యోగాల కోసం 25 మిలియన్ల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇదే నిరుద్యోగానికి మంచి నిదర్శనం అన్నారు. ఉద్యోగాల కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారని అర్థమవుతోందన్నారు. ఎన్నో ఏళ్లుగా జాబ్ డేటా సరిగా లేదని అభిప్రాయపడ్డారు. సరైన జాబ్ డేటా ఉండాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు అయితే భద్రతకు ఢోకా లేదని చాలామంది భావిస్తున్నారని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ స్కీం పై రాజన్
సోమవారం ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రకటించిన మినిమం గ్యారెంటీ స్కీం పైన కూడా రఘురాం రాజన్ మాట్లాడారు. అసలు పేదల లెక్క ఎలా తీస్తారని ఆయన ప్రశ్నించారు. నిరుపేదలకు నేరుగా డబ్బులు అందజేయడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. వివిధ అనుభవాల కారణంగా ఇలాంటి ఆలోచనలు వస్తాయన్నారు. అవసరమైన వారికి ఈ పథకం వర్తింప చేయవచ్చునని, అయితే, ఏ పథకాలు ఉంటే లేదా ఏ పథకాలు లేకుంటే దీనికి అర్హులో తెలియాల్సి ఉందన్నారు.