జెట్ ఎయిర్వేస్ను టాటా సన్స్ ఆదుకునేనా?: చైర్మన్ గోయల్ను వెళ్లిపోమ్మంటున్న బ్యాంకర్లు
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ సంక్షోభం కొనసాగుతోంది. గత కొద్ది నెలలుగా పైలట్లు, ఇతర సిబ్బందికి జీతాలు అందటం లేదు. అదే సమయంలో స్పైస్ జెట్, ఇండిగో ఎయిర్ లైన్స్ వైపు పైలట్లు చూస్తున్నారు. ఇంటర్వ్యూలకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. 260 మంది ఇంటర్వ్యూల కోసం రాగా, అందులో 150 మంది కెప్టెన్లు ఉన్నారు. జెట్ ఎయిర్వేస్ విమానం నిలిపేసిన బోయింగ్ విమానాలను లీజుకు తీసుకోవాలని స్పైస్ జెట్ భావిస్తోంది. జెట్ ఎయిర్వేస్కు విమానాలను అద్దెకిచ్చిన మూడు కంపెనీలు గత వారం స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్ను కలిశాయి. స్పైస్ జెట్ కూడా ఈ లీజుకు సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు, జెట్ ఎయిర్వేస్ను పునరుద్ధరించి ప్రస్తుత యాజమాన్యాన్ని మార్చాలని బ్యాంకర్లు కూడా ప్రతిపాతిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
స్పైస్ జెట్ ఇంటర్వ్యూలకు జెట్ ఎయిర్వేస్ పైలట్లు
టాటా సన్స్ పేరు
ఈ నేపథ్యంలో తెరపైకి టాటా సన్స్ పేరు వస్తోంది. జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించాలంటే టాటా సన్స్ బెస్ట్ అని రుణదాతలు భావిస్తున్నారట. గత ఏడాది టాటా సన్స్ కంపెనీ, జెట్ ఎయిర్వేస్ మధ్య చర్చలు జరిగాయి. 2018 నవంబర్ నెలలో జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసే అంశంపై చర్చ జరిగింది. కానీ ఈ డీల్ విషయంలో తొందరపడవద్దని బోర్డు నిర్ణయించింది. కొనుగోలు చేసేందుకు టాటా సన్స్ ఆసక్తి చూపలేదు. దీంతో భాగస్వామి ఎతిహాద్ ఎయిర్వేస్ నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ నాలుగు నెలలు తిరిగేసరికి సంక్షోభంలో కూరుకుపోయింది. పైగా ఎతిహాద్ తమ 24 శాతం వాటా బ్యాంకులకు ఇచ్చేందుకు సిద్ధపడింది. ఇదిలా ఉండగా, ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో టాటా సన్స్ పేరు వినిపిస్తోంది.
టాటా సన్స్ గట్టెక్కిస్తుందని విశ్వాసం
టాటాలు దశాబ్దాల క్రితమే దేశంలో మొదటి విమానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం టాటా గ్రూప్కు విస్తారాలో 51 శాతం, ఎయిర్ ఏసియాలో 49 శాతం పెట్టుబడులు ఉన్నాయి. టాటా సన్స్కు అన్ని రంగాల్లో మంచి పేరు ఉంది. సుదీర్ఘ అనుభవం ఉంది. సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్కు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అవసరమని భావిస్తున్నారు. టాటా సన్స్ అయితే గట్టెక్కించగలదని భావిస్తున్నారు. ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించడం కోసం ఎస్బీఐ.. టాటా సన్స్ వద్దకు వెళ్తే ఇదే మొదటిసారి కాబోదని అభిప్రాయపడుతున్నారు. రుణం ఇచ్చిన బ్యాంకర్లకు ప్రస్తుతానికి ఉన్న బెట్టర్ ఆప్షన్ టాటా సన్స్ అని అభిప్రాయపడుతున్నారు. అందుకే రుణ దాతలు అయిన బ్యాంకర్లు జెట్ ఎయిర్వేస్ యాజమాన్యం మార్పు కోరుకుంటున్నారని భావిస్తున్నారు. యాజమాన్యం మారితే టాటా సన్స్ వంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ను రప్పించి, గట్టెక్కించవచ్చునని భావిస్తున్నారట.
నరేష్ గోయల్ తప్పుకోవాలని రుణదాతల డిమాండ్
కాగా, జెట్ ఎయిర్వేస్ నుంచి నరేష్ గోయల్ తప్పుకోవాలని రుణదాతలు కోరుతున్నారట. ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఈ సంస్థ ఎదుగడానికి నరేష్ గోయల్ ఎంతో కృషి చేశారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. సంస్థకు అన్ని తానై ముందుండి నడిపిన నరేష్ గోయల్పై రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ముందుగా చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని గోయల్కు చెప్పాయట. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం భారీగా రుణాలు ఇచ్చాయి. ఈ సంస్థను గట్టెక్కించడం కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు బ్యాంకర్ల కన్సార్టియం కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా అరుణ్ జైట్లీ, ప్రభుత్వ ఉన్నతాధికారులు, బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జెట్ ఎయిర్వేస్ గాడిలో పడాలంటే నరేష్ గోయల్, ఆయన భార్య వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ సూచించారట. ప్రస్తుత పరిస్థితుల్లో జెట్ ఎయిర్వేస్ యాజమాన్యంలో మార్పు అత్యంత అవసరమని, వృత్తి నిపుణుల చేతికి ఇస్తే గాడినపడవచ్చునని భావిస్తున్నారు. సంస్థలో గోయల్కు ఉన్న 51 శాతం వాటాను 10 శాతానికి తగ్గించుకోవాలని, ఇందుకోసం అవసరమైన నిధుల్లో రూ.1,500 కోట్లను సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు బ్యాంకర్లు తెలిపారు. జెట్ ఎయిర్వేస్ విమానాలు నిరాటంకంగా ఎగురడానికి అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటున్నట్లు రజనీష్ కుమార్ ప్రకటించారు. వడ్డీలు, పైలెట్లకు సరైన సమయంలో జీతాలు చెల్లింపుల్లో విఫలమవడంతో మూడోవంతు మాత్రమే విమానాలు నడుస్తున్నాయి. మరోవైపు నరేష్ గోయల్ కూడా ప్రయత్నాలను వేగవంతం చేశారు. ఆయన ఇటీవల దుబాయిలో ఖతార్ ఎయిర్వేస్ సీఈవో అక్బర్ అల్బాకర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సంస్థ ఆర్థిక పరిస్థితి, నిధుల సమకూరడంపై ప్రధానంగా వీరిద్దరు చర్చించారు.