ఊగిసలాటలో మార్కెట్లు: మరింత బలహీనపడిన రూపాయి, కారణాలివే
ముంబై: స్టాక్ మార్కెట్లు ఊగిసలాడుతున్నాయి. ఉదయం 9.38 సమయానికి సెన్సెక్స్ నాలుగు పాయింట్ల నష్టంతో 38,358 వద్ద నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 11,553 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఐటీ, స్థిరాస్తి రంగ షేర్లు లాభాల్లో కనిపించాయి. జెట్ ఎయిర్వేస్ షేరు ధర నాలుగు శాతం పతనమైంది. సంక్షోభానికి తోడు ఎతిహాద్ తమ 24 శాతం వాటాను విక్రయిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు, అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయాలను ప్రకటించనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు మందకొడిగానే కనిపిస్తున్నాయి. భారత మార్కెట్లపై ఫెడ్నిర్ణయ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.
వరుసగా ఏడో రోజు పరుగులు పెట్టిన రూపాయి: మోడీ సహా కారణాలివే
గత వారం రోజులుగా దేశీయ కరెన్సీ లాభాల బాట పట్టిన విషయం తెలిసిందే. మంగళవారంసాయంత్రం రూపాయి ట్రేడింగ్ 43 పైసలు బలహీనపడింది. 68.96 వద్ద నిన్న ముగిసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 14 పైసలు క్షీణించి 69.10 వద్ద బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఆ తర్వాత 69.15 వద్ద కొనసాగింది. డాలర్తో రూపాయి మారకం విలువ 0.2 శాతం తగ్గింది. మంగళవారం 68.36 వద్ద 2019లో గరిష్టాన్ని తాగింది. ఆరు రోజుల్లో 160 పైసలు పురోగమించిన రూపాయి, బుధవారం కొంత బలహీనపడింది. ఫెడ్ పాలసీ, ముడిచమురు ధరలు పెరగడం, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం వంటి కారణాల వల్ల బలహీనపడిందని విశ్లేషకులు చెబుతున్నారు.
వేదాంత, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్ వంటి సంస్థలు సెన్సెక్స్లో లాభాలబాటన ఉన్నాయి. నిఫ్టీలో ఇండియా బుల్స్, ఇన్ఫోసిస్, హిండాల్కో, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభాల్లో ప్రారంభమయ్యాయి.