బ్యాంక్స్ , ఐటి స్టాక్స్ అండతో 5వ రోజూ లాభాల్లో ముగింపు
స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో రోజు కూడా లాభాల్లో ముగిసి ఇన్వెస్టర్లను ఆశ్చర్యంతో ముంచెత్తాయి. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ నుంచి వచ్చిన మద్దతుతో రికార్డ్ గెయిన్స్ను నమోదు చేశాయి. బ్యాంక్ నిఫ్టీ 2016 తర్వాత బెస్ట్ వీక్లీ గెయిన్స్ను నమోదు చేసింది. 2019 గరిష్టస్థాయిలదగ్గర సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు క్లోజయ్యాయి. ఈ ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన నిఫ్టీ మిడ్ సెషన్ తర్వాత మరింత బలం పుంజుకుంది. ఒక దశలో ఇంట్రాడేలో 11,487 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ఆఖర్లో ట్రేడర్లు కొద్దిగా లాభాల స్వీకరణకు దిగారు. దీంతో పీక్ నుంచి నిఫ్టీ 60 పాయింట్లు కోల్పోయింది. అయినా 84 పాయింట్ల లాభంతో 11,426 దగ్గ నిఫ్టీ క్లోజైంది. సెన్సెక్స్ 270 పాయింట్లు పెరిగి 38024 దగ్గర ముగిసింది.
లోక్సభ ఎన్నికల ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఐదో రోజూ పెరగడం 15ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం మరో విశేషం.కోటక్ మహీంద్రా, ఇండియన్ ఆయిల్, హెచ్ పి సి ఎ్, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ టాప్ 5 గెయినర్స్గా నిలిచాయి. హిందుస్తాన్ యునిలివర్,యెస్ బ్యాంక్, ఐటీసీ, రిలయన్స్, భారతి ఎయిర్టెల్ స్టాక్స్ టాప్ లూజర్స్\ జాబితాలో చేరాయి.
బ్యాంక్ నిఫ్టీలో మోత
ప్రభుత్వ - ప్రైవేట్ బ్యాంకుల స్టాక్స్లో ఏర్పాటు చేసిన సూచీ బ్యాంక్ నిఫ్టీ. ఇది మూడేళ్ల తర్వాత బెస్ట్ వీక్లీ గెయిన్స్ను నమోదు చేసింది. ఇంట్రాడేలో 29520 పాయింట్ల గరిష్ట స్థాయిని టచ్ చేసిన బ్యాంక్ నిఫ్టీ ఆఖర్లో కొద్దిగా నీరసించింది. ప్రధానంగా కోటక్ బ్యాంక్ 5 శాతం లాభాలతో రూ.1328 దగ్గర క్లోజైంది. ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కూడా ఇండెక్స్ వృద్ధికి దోహదపడ్డాయి. చివరకు 458 పాయింట్ల లాభంతో 29381 దగ్గర క్లోజైంది.
రూపాయి బలమే బలం
డాలర్తో పోలిస్తే రూపాయి ఈ రోజు అనూహ్యంగా పుంజుకుంది 20 పైసలకు పైగా లాభపడి రూ.69.06 వరకూ వెళ్లింది. అయినా ఐటి స్టాక్స్ మాత్రం ఇంట్రాడేలో లాభపడ్డాయి. వరుసగా నాలుగో రోజు కూడా రూపాయి భారీగా బలం పుంజుకుంది.ఐటీ ఇండెక్స్ సుమారు 2 శాతం పెరిగింది. టాటా ఎలక్సీ 3 శాతం, విప్రో-హెచ్ సి ఎల్ టెక్ 2.5 శాతం పెరిగాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ కూడా రెండు శాతం వరకూ లాభపడ్డాయి.
రిలయన్స్ ఆఖర్లో నీరసించింది
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉదయం నుంచి స్థిరంగానే ఉంది. ఒక దశలో 3 శాతం వరకూ లాభపడి రూ.1359 వరకూ వెళ్లింది. ఆఖర్లో అనూహ్యమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది రిలయన్స్. చివరకు 1.5 శాతం నష్టపోయి రూ.1323 దగ్గర క్లోజైంది. రికార్డ్ స్థాయిలకు వెళ్లినస్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
దిలీప్ బిల్డ్కాన్ లాంగ్ జంప్
దిలీప్ బిల్డ్కాన్ మరోసారి ఎగిరి గంతేసింది. ఏకంగా 10 శాతం పెరిగి అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది. ఈ మధ్యకాలంలో రెట్టింపు అయిన స్టాక్లో కొద్దిగా లాభాల స్వీకరణ వచ్చినప్పటికీ ఈ స్థాయి జంప్ను ఎవరూ ఊహించలేదు. చివరకు స్టాక్ రూ.664 దగ్గర క్లోజైంది.
అదానీ ట్రాన్స్మిషన్
అదానీ గ్రూపులోని ట్రాన్స్మిషన్ స్టాక్లో ఈ రోజు భారీ వాల్యూమ్స్ నమోదయ్యాయి. 20 రోజుల యావరేజ్ వాల్యూమ్స్తో పోలిస్తే ఐదు రెట్లు అధికంగా స్టాక్స్ ఈ రోజు చేతులు మారాయి. చివరకు స్టాక్ 13.84 శాతం లాభపడి రూ.235 దగ్గర క్లోజైంది.
స్టెరిలైట్కు చైనా షాక్
టెలికాం కేబుల్స్ తయారీ సంస్థ స్టెరిలైట్ టెక్కు చైనా నుంచి నెగిటివ్ న్యూస్ వచ్చింది. ఆ దేశంలో డిమాండ్ - సప్లై మధ్య ఊహించిన దానికంటేఅధిక వ్యత్యాసం ఉన్నట్టు స్వయంగా కంపెనీ ప్రకటించింది. దీనికి తోడు చైనా మొబైల్ టెండర్ ప్రక్రియ ఆలస్యం కావడం కూడా మరో ఎఫెక్ట్. దీంతో స్టాక్ చివరకు 10.39 శాతం నష్టంతో రూ.231.25 దగ్గర క్లోజైంది.
మిడ్ క్యాప్స్ ప్రాఫిట్ బుకింగ్
ఈ వారం ర్యాలీలో పాల్గొన్న అనేక స్టాక్స్లో లాభాల స్వీకరణ నమోదైంది. ఐనాక్స్ విండ్ 7 శాతం, ప్రిజం సిమెంట్ 6 శాతం, టెక్స్ రైల్ 6 శాతం నష్టపోయాయి. జస్ట్ డయల్, రెయిన్ ఇండస్ట్రీస్, హెల్త్ కేర్ గ్లోబల్, పవర్ మెక్ ప్రాజెక్ట్స్, శ్రేయీ ఇన్ఫోసిస్ స్టాక్స్ 5 శాతం వరకూ కోల్పోయాయి.