పీఎఫ్పై వడ్డీ పెరిగిందోచ్ ! ఎన్నికలకు ముందు కేంద్రం తాయిలం
కేంద్ర ప్రభుత్వం ఎన్నికలక ముందు మరో చిన్న తాయిలం ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఆశలు పెట్టుకునే పీఎఫ్పై వడ్డీ రేటును 0.10 శాతం పెంచింది. ప్రస్తుతం ఉన్న 8.55 శాతం వడ్డిని 8.65 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఈ నూతన వడ్డీ రేట్ వర్తిస్తుంది.
ఈ రోజు భేటీ అయిన ఉద్యోగ భవిష్య నిధి సంస్థ - ఈపీఎఫ్ఓ బోర్డ్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. 2016 తర్వాత మళ్లీ వడ్డీ రేట్ను ఇప్పుడే పెంచారు. దీంతో ఆరు కోట్ల మంది ఉద్యోగులకు కొద్దిగా ఊరట లభించినట్టైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్కు నేతృత్వం వహించే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ట్రస్టీస్ ఆమోదం తర్వాత కేంద్ర ఆర్థిక శాఖకు ఈ ఫైల్ చేరుతుంది. ఆర్థిక శాఖ ఆమోదం తర్వాతే సబ్స్క్రైబర్ల ఖాతాల్లోకి వడ్డీ జమ అవుతుంది.
2016-17లో వడ్డీ రేట్ 8.65 శాతంగా, 2015-16లో 8.8 శాతంగా ఉండేది. అదే 2013-15 మధ్య కూడా వడ్డీ రేట్ 8.75 వరకూ ఉండేది.
కనీస పెన్షన్ రూ.1000 ఇప్పుడు లేనట్టే
ఈ రోజు భేటీ అయిన బోర్డ్ మీటింగ్ లో కనీసం రూ.1000 పెన్షన్పై ఏకాభిప్రాయం రాలేదు. గతంలో దీనిపై అనేక సందర్భాల్లో చర్చకు వచ్చినా ఒక నిర్దిష్టమైన నిర్ణయం మాత్రం వెలువడడం లేదు. తర్వాతి బోర్డ్ మీటింగ్లో దీనిపై చర్చించాలని ట్రస్టీలు నిర్ణయించారు.