157 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, దూసుకెళ్లిన యస్ బ్యాంక్ షేర్లు
ముంబై: గురువారం నాడు నిఫ్టీ 10,750 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 157.89 పాయింట్లు తగ్గి 35876.22 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ దాదాపు 47.70 పాయింట్లు కోల్పోయింది. యస్ బ్యాంకు, ఇండియా బుల్స్ హౌసింగ్, జీ ఎంటర్టైన్మెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఐవోసీ, బీపీసీఎల్, హిండాల్కో, భారతీ ఎయిర్ టెల్, గెయిల్ నష్టాల్లో ముగిశాయి.
నేటి ట్రేడింగ్ సెషన్లో యస్ బ్యాంక్ షేర్ల ధర దాదాపు 30శాతం పెరిగింది. 2017-18 సంవత్సరానికిగానూ బ్యాంక్ కేటాయించిన ప్రొవిజన్లు, ఆస్తుల వర్గీకరణల్లో ఎటువంటి లోపాలు లేవని ఆర్బీఐ వెల్లడించింది. ఇటీవల బ్యాంకు ఆస్తుల వర్గీకరణ, ప్రొవిజన్ల కేటాయింపు, ఆదాయం వంటి అంశాలపై సుప్రీం కోర్టు పరిశీలన నిర్వహించింది. దీనికి సంబంధించిన నివేదిక నిన్న యస్ బ్యాంక్కు చేరుకొంది.
ఆర్బీఐ తొలిసారి ఏక్యూఆర్ (ఆస్తుల నాణ్యత సమీక్ష)ను 2015లో చేపట్టింది. కార్పొరేట్ రుణాల కారణంగా బ్యాంకుల ఆర్థిక స్థితి బలహీనం కావడంతో దీనిని చేపట్టింది. ఈ క్రమంలో 2015-16కు సంబంధించి దాదాపు రూ.4,176 కోట్లకు సంబంధించి ఎన్పీఏలకు సంబంధించిన తేడాలను కనుగొంది. ఆ తర్వాత కూడా 2016-17లో రూ.2,018 కోట్లు ఎన్పీఏలుగా యస్ బ్యాంక్ ప్రకటించింది. కానీ, ఆర్బీఐ యస్ బ్యాంక్ ఎన్పీఏలు రూ.8,373. 8కోట్లుగా ప్రకటించింది. అప్పట్లో బ్యాంక్ ప్రకటించిన మొత్తానికి ఆర్బీఐ ప్రకటించిన మొత్తానికి మధ్య దాదాపు రూ.6,355కోట్ల వ్యత్యాసం ఉంది.