కొత్త ఈ కామర్స్ విధానంపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన పతంజలి
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులపై ఫిబ్రవరి 1 నుంచి కొత్తగా తీసుకొచ్చిన ఈకామర్స్ పాలసీని బాబా రాందేవ్కు చెందిన పతంజలి ఆయుర్వేద్ సంస్థ మద్దతు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో రీటెయిల్ రంగానికి కూడా సమన్యాయం జరుగుతుందని అభిప్రాయపడింది. అంతేకాదు ఆన్లైన్ షాపింగ్ రీటెయిల్ షాపింగ్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుందని పేర్కొంది. ప్రముఖ ఈ రీటెయిలర్స్ అయిన అమెజాన్ సంస్థ, ఫ్లిప్కార్ట్, పేటీఎంలతో తన ఉత్పత్తులను పతంజలి ఉంచిన ఏడాదికి ప్రభుత్వ నిర్ణయంపై హర్షం తెలపడం విశేషం. రీటెయిల్ రంగం, ట్రేడ్ రంగాలకు సమన్యాయం జరిగితే బాగుంటుందన్నదే తమ అభిమతం అని పతంజలి సంస్థ ప్రతినిధి ఎస్కే తిజారవాలా తెలిపారు.
ఈ కామర్స్ కంపెనీలతో బాబా రాందేవ్ జతకట్టడంపై కూడా వివరణ ఇచ్చారు తిజారవాలా. యువత ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్కే మొగ్గుచూపుతున్నారని బాబా రాందేవ్ భావించారని అదే సమయంలో తమ ఉత్పత్తులు ఆన్లైన్లో ఉంచితే చాలామందికి చేరే అవకాశం ఉంటుందని భావించి ఈకామర్స్ వెబ్సైట్స్తో జతకట్టారని చెప్పారు. బాబారాందేవ్కు చెందిన పతంజలి ఆయుర్వేద్ ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో ప్రజాదరణపొందడంతో ఆ పోటీని తట్టుకునేందుకు హిందుస్తాన్ యూనీ లివర్, కోల్గేట్ పామోలివ్ లాంటి సంస్థలు కూడా ఆయుర్వేద ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆయుర్వేద ఉత్పత్తులతో 2018 మార్చి నాటికి రూ.8,148 కోట్లు రెవిన్యూ వచ్చిందని కేర్ రేటింగ్స్ సంస్థ వెల్లడించింది.
ఇక గ్రాసరీకి సంబంధించిన ఉత్పత్తులకు ఆన్లైన్లో ఎక్కువగా డిస్కౌంట్ ఇస్తుండటంతో తమ వ్యాపారం దెబ్బతింటోందని పలు కంపెనీలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టే సంస్థలు కొంతకాలం పాటు కొన్ని ఉత్పత్తులను ఆన్లైన్లో పెట్టడం మానేశాయి. అలా కాకుండా కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లలోనే ఉత్పత్తులను విక్రయిస్తూ వచ్చింది. దీంతో ఎఫ్డీఐ చేసిన సంస్థలు ఉత్పత్తులను ఈకామర్స్ సైట్లలో ఉంచి విక్రయించడంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది. ఈకామర్స్లో ఉత్పత్తులు విక్రయం ప్రత్యేకించి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సేల్స్లో 2030 నాటికి 11శాతం వృద్ధి నమోదు అయ్యే అవకాశం ఉందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ నీల్సన్ చెబుతోంది. ప్రస్తుతం ఉన్న సేల్స్ కంటే రానున్న 12 ఏళ్లలో ఎనిమిది రెట్లు అమ్మకాలు పెరుగుతాయని గతేడాది నీల్సన్ సంస్థ వెల్లడించింది.