ఫిబ్రవరి 28న కేంద్ర బడ్జెట్: స్టాక్ మార్కెట్లు ఎందుకు తెరిచి ఉంచుతారు?
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 28న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే ఆర్ధిక సంవత్సరానికి (2015-16)గాను సార్వత్రిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శనివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంలో స్టాక్ మార్కెట్లు కూడా తెరిచే ఉండనున్నాయి.
అయితే సాధారణంగా శనివారం నాడు స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ జరగని విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో ఆరోజు స్టాక్ మార్కెట్లను ప్రత్యేకంగా తెరిచి ఉంచుతున్నారు. గతంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు తమ సాప్ట్ వేర్ను టెస్టింగ్ కోసం శనివారం ట్రేడింగ్ నిర్వహించేవి.
కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దాని ప్రభావం స్టాక్ మార్కెట్ల సూచీలపై రెండు రోజులు వరకూ ఉండటాన్ని గతం నుంచే మనం చూస్తున్నాం. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున స్టాక్ మార్కెట్లు కొన్న ఒడిదుకులను ఎదుర్కొంటాయనే విషయం అందరికీ తెలిసిందే.
బడ్జెట్ ప్రభావం వల్ల కొన్ని సూచీలు లాభ పడొచ్చు, మరికొన్ని సూచీలు నష్టపోవచ్చు. సాధారణంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున స్టాక్ ఎక్సేంజ్లు ఎక్కువ మేర లాభపడుతుంటాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని 2001 తర్వాత నుంచి కేంద్రం బడ్జెట్ను ఎప్పుడూ ప్రవేశపెడుతున్న స్టాక్ ఎక్సేంజ్లు ట్రేడింగ్ను నిర్వహిస్తున్నాయి.
ఇటీవల కాలంలో సెబీ ఛైర్మన్ యుకె సిన్హా మాట్లాడుతూ ప్రభుత్వం తన అనుకూలతను బట్టి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. అయితే స్టాక్ మార్కెట్లు వారి కాలెండర్ ఆధారంగా పనిచేస్తాయిని అన్నారు. కాబట్టి కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ఇంకా 12 రోజుల సమయం ఉన్నందున ట్రేడింగ్ గురించి ఇప్పటి నుంచే ఆలోచన మొదలు పెట్టండి.
సార్వత్రిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న తరుణంలో దీంతో అన్ని వర్గాల్లోనూ భారీ అంచనాలు, ఆశలు నెలకొన్నాయి. వీరి బడ్జెట్ కోర్కెల చిట్టాలో పన్ను ప్రయోజనాలు, సుంకం చెల్లింపు రాయితీలే అధికం. ముఖ్యంగా రెట్రోస్పెక్టివ్ పన్ను విధానంపై మరింత స్పష్టత నివ్వాల్సిన అవసరం ఉందని పన్ను చట్టాల నిపుణులు కోరుతున్నారు.