మోడీ, వర్షాలపై విశ్వాసం: లాభాల్లో మార్కెట్లు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టనున్న సంస్కరణలు, రుతుపవనాల గమనంపైన ఉన్న విశ్వాసంతో పెట్టుబడులుదారులు భారత మార్కెట్లలో విస్తృతంగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో సోమవారం కూడా స్టాక్ మార్కెట్లు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. 174 పాయింట్ల లాభంతో బిఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభమైంది. కాగా, దేశీయ మార్కెట్లలోకి జులై నెల ఆరంభం నుంచి 22,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడుల వచ్చాయి.
స్టాక్మార్కెట్లలోకి 10,755 కోట్ల రూపాయల (1.8 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు రాగా, రుణ మార్కెట్లలోకి 11,268 కోట్ల రూపాయల (1.89 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు వచ్చాయి. దీంతో జూలై 1-19 మధ్య మొత్తం 22,023 కోట్ల రూపాయల (3.67 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు వచ్చినట్లు స్టాక్మార్కెట్ల వివరాల ద్వారా స్పష్టమవుతోంది. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆర్థిక సంస్కరణల అజెండాపై విశ్వాసంతోనే దేశీయ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ మదుపర్లు ఆసక్తి కనబరుస్తున్నారని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2014-15కుగానూ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో మదుపర్లను ఉత్సాహపరిచేలా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పలు చర్యలు తీసుకోవడంతో విదేశీ పెట్టుబడుల వరద కొనసాగుతుందని అమెరికాకు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. ఇదిలావుంటే ఈ ఏడాది ప్రారంభం నుంచి విదేశీ మదుపర్లు 1.45 లక్షల కోట్ల రూపాయల (24 బిలియన్ డాలర్ల) పెట్టుబడులను దేశీయ మార్కెట్లలోకి తీసుకొచ్చారు. ఇందులో 70,550 కోట్ల రూపాయల పెట్టుబడులు స్టాక్మార్కెట్లలోకి, 74,000 కోట్ల రూపాయల పెట్టుబడుల రుణ మార్కెట్లలోకి వచ్చాయి.
ఈ ఏడాది జూన్ ఆరంభం నుంచి విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్ఐఐ)తోపాటు సబ్-అకౌంట్లు, క్వాలిఫైడ్ ఫారిన్ ఇనె్వస్టర్లను కలిపి స్టాక్మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఫారిన్ పోర్ట్ఫొలియో ఇనె్వస్టర్లని పిలుస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు దేశీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించిన నాటి నుంచి దాదాపు 9.35 లక్షల కోట్ల రూపాయల (195 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు వచ్చాయి. ఇది ఇలా ఉండగా సోమవారం ప్రపంచ బ్యాంక్ ఛైర్మన్ జిమ్ యంగ్ కింగ్ సోమవారం ఢిల్లీకి రానున్నారు. ఆయన ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను కలవనున్నారు.