జైట్లీ బడ్జెట్: లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకుపోయాయి. సెన్సెక్స్ 450 పాయింట్లకు పైగా లాభంలో దూసుకెళ్లగా, 140 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. కాగా, పలువురు బ్యాంకింగ్ రంగ అధిపతులు, పారిశ్రామిక వేత్తలు నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై సంతృప్తి వ్యక్తం చేశాయి.
ఐసిఐసిఐ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కెవి కామత్ మాట్లాడుతూ.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఇది ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని చెబుతోందని అన్నారు. కేంద్ర బడ్జెట్ సమతూకంగా ఉందని ఫ్యాప్సీ అధ్యక్షుడు శివకుమార్ అన్నారు. మూడేళ్లలో ద్రవ్యలోటు తగ్గిస్తామనడం శుభపరిణామమని అన్నారు. సోలార్ విద్యుత్ కు ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు న్యాయం జరిగిందన్నారు.
‘ఆర్థిక మంత్రి ఇచ్చిన తన హామీల ప్రకారమే ప్రస్తుత బడ్జెట్ ఉంది. దేశంలోని మౌళిక రంగ అభివృద్ధికి ఈ బడ్జెట్ తోడ్పాటునందించే విధంగా ఉంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు రూ. 37,850 కోట్లను కేటాయించడాన్ని బట్టి చూస్తే.. రోడ్డు రవాణా, రియల్ ఎస్టేట్ రంగాలకు ఊపునిచ్చేదిగా ఉంది' అని అమిత్ ఎంటర్ప్రైజెస్ హౌజింగ్ లిమిటెడ్ సిఎండి కిశోర్ పాటే పేర్కొన్నారు.
భవిష్యత్ అంచనాలకు తగినట్లుగా, వృద్ధి రేటను పెంచే విధంగా ప్రస్తుత బడ్జెట్ ఉందని కెపిఎంజి ఇండియా టాక్స్ సహా అధిపతి గిరీష్ వేన్వరి అన్నారు. ప్రస్తుత బడ్జెట్ ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు కనిపిస్తోందని, రిజర్వు బ్యాంకుకు తన మద్దతును తెలియజేసినట్లుగా ఉందని బ్యాంక్ ఆఫ్ బరోడా ముఖ్య ఆర్థిక నిపుణులు రూపా రెజ్ నిత్సూరు తెలిపారు.