ఆర్థిక సర్వే: బడ్జెట్పై మార్కెట్ల ఆశలు
ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఊతమిచ్చేందుకు దేశ వ్యాప్తంగా 16 జాతీయ పెట్టుబడి, ఉత్పత్తి జోన్ (ఎన్ఐఎంజడ్)లను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ ఉత్పత్తి విధానం కింద వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. రానున్న పదేళ్ల కాలంలో 10 కోట్ల ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో ఉత్పత్తి రంగం వాటాను 25 శాతానికి పెంచాలన్నది జాతీయ ఉత్పత్తి విధాన ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. ఈ 16 ఎన్ఐఎంజడ్లలో ఎనిమిదింటిని ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ (డిఎంఐసి)లో ఏర్పాటు చేస్తున్నారు.
మిగిలిన ఎనిమిది ఎన్ఐఎంజడ్ల ఏర్పాటుకు కూడా సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. వీటిని నాగ్పూర్, చిత్తూరు, మెదక్, తుమ్కూరు, కోలార్, బీదర్, గుల్బర్గాలలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కనీసం 50 చదరపు కిలోమీటర్ల (5 వేల హెక్టార్ల) విస్తీర్ణంలో పారిశ్రామిక వాడలతో పాటు ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో ఎన్ఐఎంజడ్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. డిఐఎంసి ప్రాజెక్టును జపాన్ సహాయంతో అభివృద్ధి చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్టత్రో పాటు పశ్చిమ రైల్వే సరుకు రవాణా కారిడార్లు ఈ ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి.
దేశంలో నిరర్థక ఆస్తులు, ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు గత రెండేళ్ల కాలంలో నాలుగు రెట్లు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆర్థిక సర్వే పేర్కొంది. పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం పార్లమెంట్కు సమర్పించిన ఆర్థిక సర్వేలో స్పష్టం చేశారు. ‘2012-13 ఆర్థిక సంవత్సరంలో నిరర్థక ఆస్తులు గణనీయంగా పెరిగడంతో బ్యాంకింగ్ రంగ ఆస్తుల నాణ్యత ఘోరంగా దిగజారింది. ఇది ఎంతో ఆందోళన కలిగిస్తోంది' అని జైట్లీ తెలిపారు.
2008-09 కాలంలో 2.09 శాతంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు 2014 మార్చి నాటికి 4.4 శాతానికి చేరుకున్నాయని, 2010లో రూ.59,972 కోట్లుగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు ఈ ఏడాది మార్చి నాటికి నాలుగు రెట్లు పెరిగి రూ.2,04,249 కోట్లకు చేరుకున్నాయని ఆయన అన్నారు.
బడ్జెట్పై మార్కెట్ల ఆశలు
గురువారం తొలిసారిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం సమర్పించబోయే సాధారణ బడ్జెట్పై భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. కాగా, దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను బుధవారం పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక సర్వే ప్రధానంగా ప్రస్తావించడంతో బుధవారం బిఎస్ఈ సెన్సెక్స్ మరో 137 పాయింట్లు పతనమై వారం రోజుల కనిష్టస్థాయికి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లు సైతం బలహీనంగా ఉండడం మదుపరుల సెంటిమెంట్పై మరింతగా నీళ్లు చల్లింది. నిన్నటి రైలు బడ్జెట్తో ఎదురయిన కొద్దిపాటి నిరుత్సాహం తర్వాత రేపటి బడ్జెట్లో ప్రభుత్వంనుంచి మరిన్ని కఠిన చర్యలు ఉండవచ్చన్న మదుపరుల అంచనాల సంకేతాలు మార్కెట్లో స్పష్టంగా కనిపించాయని బ్రోకర్లు అంటున్నారు. ఆటో, విద్యుత్, రియల్టీ, ఫార్మా, వౌలిక వస్తువులు, ఐటి రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోగా రిఫైనరీ, వినయోగ వస్తువులు, ఎఫ్ఎంసిజి రంగాలకు చెందిన షేర్లకు మంచి కొనుగోళ్ల మద్దతు లభించింది.
మంగళవారం దాదాపు 518 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ బుధవారం కాస్త మెరుగ్గానే ప్రారంభమై ఆ తర్వాత 25,683.97, 25, 364.77 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చివరికి 137.30 పాయింట్లు నష్టపోయి 25,444.81 పాయింట్ల వద్ద ముగిసింది. జూన్ 30 తర్వాత సెన్సెక్స్ ఇంత తక్కువ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి.