మోడీ సర్కారు చర్యల్ని బలపర్చాల్సిందే: రతన్
న్యూఢిల్లీ: కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థకు తిరిగి జవజీవాలు అందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, వాటిని దేశ ప్రజలు బలపర్చాల్సిన అవసరం ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ ఎమిరటస్ ఛైర్మన్ రతన్ టాటా అన్నారు.
‘దేశం మార్పు కోసం ఓట్లు వేసింది. మనమంతా కలిసికట్టుగా నిలబడి, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను మళ్లీగాడిలో నిలపడానికి కొత్త సర్కారు తీసుకుంటున్న చర్యలకు మద్దతును అందించాల్సి ఉంది' అని రతన్ టాటా బుధవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. వాహన రంగానికి ఇదివరకు ప్రకటించిన తక్కువ ఎక్సైజ్ సుంకం రేట్ల కొనసాగింపు, వరికి కనీస మద్దతు ధర పెంపు తదితర కీలక నిర్ణయాలను మోడీ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో మోడీ సాధించిన అఖండ విజయం భారతదేశ సౌభాగ్యం, ఆర్థిక పురోభివృద్ధి కోసం ప్రజలు దృఢమైన నాయకత్వాన్ని, స్పష్టమైన విధానాలను కోరుకుంటూ ఇచ్చిన తీర్పును ప్రతిబింబిస్తోందని ఆయన కొనియాడారు.
డిసెంబర్ దాకా ఎక్సైజ్ ఊరట
నిస్సత్తువ ఆవరించిన దేశ ఆర్థిక వ్యవస్థలో తిరిగి ఉత్తేజాన్ని నింపే లక్ష్యంలో భాగంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ బుధవారం ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్ రంగాలకు ఎక్సైజ్ సుంకం తగ్గింపును మరో ఆరు నెలలు పొడిగించింది. డిసెంబర్ 31 వరకు ఎక్సైజ్ సుంకం తగ్గింపు వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆయా రంగాలు హర్షం వ్యక్తం చేశాయి. రాబోయే పండగ సీజన్లలో తమ వ్యాపారం బాగా జరగడానికి ఇది దోహదపడుతుందన్న విశ్వాసాన్ని మారుతి సుజుకి, హోండా కార్స్ ఇండియా, జనరల్ మోటార్స్, ఎల్జి ఇండియా, గోద్రెజ్ అప్లియెనె్సస్, వర్ల్ఫూల్ వెలిబుచ్చాయి.