20 ఏళ్లకు Home Loan తీసుకున్నవారు 24 ఏళ్ల పాటు ఈఎంఐలు చెల్లించాలి.. ఎందుకంటే..?
Home Loan: రిజర్వు బ్యాంక్ రెపో రేట్లను పెంచటం చాలా పెద్ద తలనొప్పిగా మారింది. చెల్లించాల్సిన హోమ్ లోన్ మెుత్తం కొండలా పెరిగిపోయింది. మధ్య తరగతి, ఉద్యోగంపై ఆదారపడి గృహ రుణాలు తీసుకున్న వారికి బ్యాంకులు పెద్ద షాక్ ఇస్తున్నాయి. కష్టార్జితమంతా పెరిగిన లోన్ మెుత్తం చెల్లించేందుకు ఆవిరవుతోందని వారు వాపోతున్నారు.
వడ్డీ రేట్లు పెరగటం వల్ల..
పెరిగిన వడ్డీ రేటు కారణంగా బ్యాంకులు హోమ్ లోన్ కాలాన్ని పెంచుతాయి. గత నాలుగేళ్లు రేట్లు తక్కువగా ఉండటంతో చాలా మంది హోమ్ లోన్స్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ద్రవ్యోల్బణం కారణంగా భారం పెరుగుతోంది. అప్పట్లో రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించటంతో చాలా మంది రుణాలపై ఇళ్లు కొనుకున్నారు. అయితే ఇప్పుడు ఈఎంఐలు పెరగటం వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది.
20 ఏళ్ల గృహ రుణం తీసుకుంటే..
ఒక కస్టమర్ 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్నట్లయితే.. పెరిగిన వడ్డీ రేట్ల వల్ల వారు ఇప్పుడు 24 ఏళ్ల పాటు EMIలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ మెుత్తం మారదు. గడచిన ఐదు నెలల్లో వీటి వడ్డీ రేట్లు 6.5% నుంచి 8.25 శాతానికి పెరగటమే ఇందుకు కారణం. 2019లో ఎవరైన వ్యక్తి 20 ఏళ్ల కాలానికి హోమ్ లోన్ తీసుకున్నట్లయితే దానిని చెల్లించటానికి 21 ఏళ్ల పాటు ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది.
2019లో లోన్ తీసుకుంటే..
ఒక వ్యక్తి ఏప్రిల్ 2019లో 20 ఏళ్ల కాలానికి రూ.50 లక్షలు హోమ్ లోన్ తీసుకుంటే అతని పరిస్థితి ఏమిటనే విషయాన్ని ఇప్పుడు గమనిద్దాం. గత కొన్ని నెలలుగా రెపో రేట్లు పెరగటం వల్ల అతను వాస్తవంగా చెల్లించాల్సిన ఈఎంఐల సంఖ్య పెరుగుతుంది. దానివల్ల పదవీకాలం 20 ఏళ్ల నుంచి 22 ఏళ్ల 10 నెలలకు పెరుగుతుంది.20 సంవత్సరాలకు రూ.10 లక్షల రుణం కోసం.. ఈఎంఐ ఇప్పుడు అసలు కంటే రూ.1,200 ఎక్కువగా ఉంటుంది. అంటే మరో రూ.5 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
మరింత పెరగనున్న లోన్ భారం..
ఇది ఇక్కడితో అయిపోలేదు. రానున్న కాలంలో వడ్డీ రేట్లు మరింతగా పెరుగుతాయని రిజర్వు బ్యాంక్ ఇప్పటికే పరోక్షంగా వెల్లడించింది. డిసెంబర్ సామావేశంలో కూడా పెంపు భారీగానే ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గవర్నర్ శక్తికాంత దాస్ తీసుకునే నిర్ణయంపైనే మరింత పెంపులు ఉండనున్నాయి.