క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు షాక్: 10 కోట్ల కార్డుల సమాచారం లీక్!
క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు హెచ్చరిక! బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న డిజిటల్ చెల్లింపుల సంస్థ జస్పే నుండి 10 కోట్ల మంది భారతీయుల క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దొంగిలించినట్లు స్వతంత్ర దర్యాఫ్తు సంస్థ ప్రకటించింది. ఈ డేటాను క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ రూపంలో పెద్ద మొత్తానికి డార్క్ వెబ్కు విక్రయించినట్లు పేర్కొంది. టెలిగ్రామ్ ద్వారా కూడా హ్యాకర్స్ ఈ డేటాను సేకరించారని తెలుస్తోంది. దాదాపు పది కోట్లమంది క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు హోల్డర్ల డేటా తస్కరించినట్లు సదరు ఇండిపెండెంట్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రజహారియా తెలిపారు.
ఆదాయ పన్ను క్యాలెండర్ 2021: ముఖ్యమైన ఈ తేదీలు గుర్తుంచుకోండి..
జస్పే ఏం చెప్పిందంటే
సైబర్ దాడి నేపథ్యంలో కార్డు నెంబర్లు లేదా ఆర్థిక పరమైన సమాచారానికి వచ్చిన ఢోకా లేదని, డేటా లీకైన కార్డు హోల్డర్ల సంఖ్య 10 కోట్ల లోపు ఉంటుందని జస్పే తెలిపింది. గత ఏడాది ఆగస్ట్ 18న అనధికారికంగా తమ సర్వర్లపై దాడి జరిగినా, వెంటనే నిరోధించినట్లు తెలిపింది. ఆ సమయంలో కార్డుహోల్డర్లకు సంబంధించిన సమాచారం బయటకు వెళ్లలేదని పేర్కొంది. పది కోట్ల మంది సమాచారం లేదని, కార్డుహోల్డర్ల ఈ-మెయిల్, ఫోన్ నెంబర్లు మాత్రమే బయటకు వెళ్లినట్లు తెలిపింది.
బిట్ కాయిన్ ద్వారా
అయితే డేటాను డార్క్ వెబ్లో క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ద్వారా విక్రయిస్తున్నట్లు రజహారియా తెలిపారు. ఈ డేటా కోసం హ్యాకర్లు టెలిగ్రాం ద్వారా కూడా సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు. కార్డు సమాచారాన్ని స్టోర్ చేసేందుకు జస్పే PCI DSS(పేమెంట్ కార్డు ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్)ను ఉపయోగించినట్లు తెలిపారు.
హ్యాష్ అల్గారిథం ద్వారా
కాగా, కార్డు ఫింగర్ ప్రింట్స్ జనరేట్ చేసేందుకు హ్యాకర్లు హ్యాష్ ఆల్గారిథంను ఉపయోగిస్తే మాత్రమే దీనిని డీక్రిఫ్ట్ చేయడం సాధ్యమవుతుందని సైబర్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వినియోగదారుల పేరు, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, బ్యాంకు పేరు, చెల్లింపులు, కార్డు రకం, కార్డు బ్రాండ్(వీసా, మాస్టర్ కార్డు), కార్డు ముగింపు తేదీ, చివరి నాలుగు నెంబర్స్, కార్డుదారుడి పేరు, వేలిముద్రలు ఇలా పలు వివరాలు బహిర్గతమైనట్లుగా చెబుతున్నారు.