EMI moratorium: మారటోరియం మరో 3 నెలలు పెంచుకుంటే రెండేళ్ల 'భారం' తప్పదు!
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్బీఐ ఈఎంఐ మారటోరియంను మరో మూడు నెలలు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ను మూడోసారి మే 17వ తేదీ వరకు పొడిగించారు. మరోవైపు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆంక్షలు సడలిస్తూ ఆర్థిక కార్యకలాపాలు మెల్లిగా ప్రారంభమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మారటోరియంను ఎవరు, ఏ మేరకు ఉపయోగించుకోవచ్చో చూద్దాం.
SBI వడ్డీ రేటు షాక్: రెపో ఆధారిత హోమ్లోన్ మరింత ఖరీదు, 'రియాల్టీ'యే కారణం
భవిష్యత్తులో భారం
కరోనా మహమ్మారి కారణంగా వేతనాల కోత, ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయాలు తగ్గిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈఎంఐల చెల్లింపు వాయిదా వేయడం ఊరటగానే చెప్పాలి. అయితే మారటోరియం ఉపయోగించుకుంటే ఇప్పటికి ఇప్పుడు ఆర్థిక ఒత్తిడి మాత్రమే తగ్గించుకోవచ్చు. భవిష్యత్తులో ఇది భారంగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే దీనిని ఉపయోగించుకోవడం బెట్టర్.
తాత్కాలిక ఊరట.. భవిష్యత్తు భారం
మూడు నెలల మారటోరియం అని చెప్పినప్పటికీ ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. మూడు నెలల వాయిదాలకు సంబంధించి వడ్డీని, అప్పటి వరకు ఉన్న అసలు రుణంలో కలిపేస్తాయి బ్యాంకులు. దీని వల్ల అసలు మొత్తం పెరగడంతో పాటు మీరు చెల్లించే మొత్తం పెరుగుతుంది. ఇది ఈఎంఐ రూపంలో పెరగవచ్చు లేదా కాల పరిమితిలో పెరగవచ్చు.
ఎవరెవరికి ఈఎంఐ వర్తిస్తుంది
అన్ని వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, హోమ్ లోన్ సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చిన టర్మ్, వ్యవసాయ రుణాలకు ఈ మారటోరియం వర్తిస్తుంది. క్రెడిట్ కార్డు బిల్లులు, కార్డు రుణాల ఈఎంఐలకు ఉపయోగించుకోవచ్చు. ఓ బ్యాంకులో హోమ్ లోన్, మరో బ్యాంకులో పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు ఉన్నా అన్నింటికి వెసులుబాటు ఉంది.
మరో మూడు నెలలు ఉపయోగించుకుంటే షాక్
ఇప్పటికే ఆర్బీఐ కరోనా కారణంగా మూడు నెలలు మారటోరియం విధించింది. మరో మూడు నెలలు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిని ఉపయోగించుకుంటే దీర్ఘకాలంలో కొంత భారమే. ఉదాహరణకు మూడు నెలల మారటోరియం ఉంటేనే లోన్ చివరి సమయంలో ఉంటే ఒక నెల రుణభారం పెరుగుతుంది. అదే ప్రారంభంలో అయితే పన్నెండు పదమూడు కిస్తీలు పెరుగుతాయని గతంలోనే అంచనా వేశారు. ఇప్పుడు మొత్తం ఆరు నెలలు ఉపయోగించుకుంటే ఆ భారం మరింత పెరుగుతుంది. ఆరు నెలలు ఉపయోగించుకుంటే ప్రస్తుతం భారం తప్పవచ్చు. కానీ రుణ చెల్లింపు వ్యవధి దాదాపు 24 నెలల వరకు కూడా పెరుగుతుందని నిపుణుల అంచనా.
రెపో రేటు లింక్డ్
తప్పనిసరి అయితే తప్ప దీనిని ఉపయోగించుకోవద్దనేది నిపుణుల మాట. ఇప్పుడు మారటోరియం ఉపయోగించుకున్న తర్వాత.. ఆ తర్వాత పెరిగే మొత్తానికి ఈఎంఐ పెంచుకోవాలా, వ్యవధి పెంచాలా అనేది మీ ఇష్టం.బ్యాంకులు ఎక్కువగా రెపో రేటు ఆదారిత వడ్డీ రేటును ప్రామాణికంగా తీసుకొని, కొంత శాతం అధికంగా వసూలు చేస్తాయి. కాబట్టి బ్యాంకులు, హోమ్ లోన్ సంస్థల దగ్గర నుండి తీసుకున్న హోమ్ లోన్స్కు సంబంధించి ఎంసీఎల్ఆర్ ఉంటే దానిని రెపో రేటుకు మార్చుకోవడం మంచిది. అలా మార్చుకుంటే బ్యాంకులు కొంత ఛార్జ్ వసూలు చేస్తాయి.