కరోనా వాక్సిన్ కు బంగారం ధరలకు లింకేమిటో తెలుసా?
బంగారం ధరలకు కరోనా వాక్సిన్ కు లింకా... ? అదేమిటీ అంటారా... అవును. నిజమే. ఈ రెండిటికి ఒక లింకు ఉంది. అదేమిటో తెలుసుకుందాం. ఇటీవల బంగారం ధరలు పట్ట పగ్గాలు లేకుండా పెరుగుతున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా సగటున 10 గ్రాముల బంగారం ధర రూ 30,000 శ్రేణిలో ఉండగా... కరోనా వైరస్ వార్తల నేపథ్యంలో ఒక్కసారిగా ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఇటీవల రికార్డు స్థాయిలో రూ 58,000 కు చేరుకొని వినియోగదారుల్లో ఆందోళన కలిగించిన విషయం విదితమే. ప్రపంచంలో ఏదైనా పెద్ద విపత్తు వచ్చిన ప్రతి సారి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం లోకి మళ్లిస్తారు. ఎందుకంటే ఇదొక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అని రుజువు ఐంది. ప్రపంచంలోని 200 కు పైగా దేశాల్లో ఒక దేశ కరెన్సీ ని నేరుగా మరో దేశంలో చలామణికి అనుమతించరు. కానీ బంగారం అలా కాదు. దేశం ఏదైనా... ప్రాతం ఏదైనా బంగారాన్ని విక్రయించవచ్చు.. అలాగే కొనుగోలు చేయవచ్చు. ప్రపంచం లో ఈ ఒక్క కమొడిటీకే ఇంతటి ప్రాధాన్యం ఉంది. కాబట్టి, ప్రపంచంలోని తెలివైన పెట్టుబడిదారులు సంక్షోభాలు మొదలవగానే తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తారు. వాటి ఫలితమే ధరల పెరుగుదల.
నేటి బంగారం ధర: కొద్దిరోజులు ఒడిదుడుకుల, ఆ తర్వాత నిలకడగా.. పెరుగుదల
కరోనా విలయం...
డిసెంబర్ 2019 లోనే చైనా లోని వుహాన్ లో కరోనా వైరస్ ను కనుగొన్నారు. ఇది ప్రాణాంతక వైరస్ అని గుర్తించిన తర్వాత ప్రపంచాన్ని అలెర్ట్ చేశారు. అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచం పెను సంక్షోభంలోకి పడిపోయింది. ప్రస్తుతం 2 కోట్లకు మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. సుమారు 7.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియా లో కూడా 22 లక్షల మందికి సోకిన ఈ వైరస్ ఇప్పటికే 45,000 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం స్పష్టమైంది. బిజినెస్ లు దివాళా తీస్తున్నాయి. ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. అమ్మకాలు పడిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ కూడా ఢమాల్ అయిపోయింది. దీంతో ఇన్వెస్టర్లకు ఉన్న ఒకే ఒక్క మార్గం బంగారం. అందుకే వారంతా ఒక్కసారిగా గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెంచేశారు. అది కాస్త బంగారం ధరలు పెరిగేందుకు కారణం ఐంది.
వాక్సిన్ న్యూస్ తో ...
కరోనా వైరస్ కు ప్రపంచవ్యాప్తంగా వాక్సిన్ కనిపెట్టేందుకు వందల సంఖ్యలో కంపెనీలు పోటీ పడుతున్నాయి. మన దేశంలోనూ సుమారు పది కంపెనీలు అహో రాత్రులు శ్రమిస్తూ వాక్సిన్ ను అభివృద్ధి చేసే పనిలో బిజీగా ఉన్నాయి. అయినా సరే ఏదో ఒక మూలలో అనుమానం. అసలు ఎప్పటికల్లా వాక్సిన్ తయారు అవుతుంది అనే సంశయం అటు ప్రజల్లో ఇటు వినియోగదారుల్లో నెలకొంది. కానీ, నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ఒక్క ప్రకటన ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. తాము వాక్సిన్ ను అభివృద్ధి చేశామని, దానిని తన సొంత కూతురికి కూడా వేసి చూశామని అయన చెప్పటం, అలాగే సెప్టెంబర్, అక్టోబర్ కల్లా వాక్సిన్ ను రష్యా లో పెద్ద ఎత్తున ప్రజలకు వాక్సిన్ వేస్తామని ప్రకటించటంతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. అలాగే ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తామన్నారు. దీంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆశ మొదలైంది. ఇన్వెస్టర్లలో నమ్మకం కుదిరింది. ఆ ప్రభావం బంగారం పై కనిపించింది. ఇకపై పెట్టుబడుల సరళి మారిపోతుంది.
అందుకే తగ్గుతున్నాయి...
రష్యా వాక్సిన్ ప్రకటనతో ఒక్కసారిగా బంగారం ధరలు 10 గ్రాములకు సుమారు రూ 5,000 తగ్గటం విశేషం. ఒక్క రష్యా నే కాకుండా అమెరికా, ఇండియా నుంచి సమర్థవంతమైన వాక్సిన్ లు వస్తాయన్న అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి తిరిగి ఇతర పెట్టుబడి సాధనాల్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, ఇప్పుడు బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే ప్రస్తుత ధరల నుంచి బంగారం ధరలు పతనం అవటం ఖాయమని చెబుతున్నారు. అందుకని, బంగారంలో ఇన్వెస్ట్ చేసే వారు, అలాగే దానిని ఆభరణాల కోసం కొనుగోలు చేసే వారు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని లబ్ది పొందాలని సూచిస్తున్నారు. కరోనా కు వాక్సిన్ వస్తుందన్న అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతుండటం అనేది స్పష్టం అయిపోయింది. సో, ఇప్పుడు వాక్సిన్ కు, బంగారం ధరలకు లింకు అర్థమైంది కదా!