జూన్ 1 నుండి బంగారంపై హాల్మార్క్ తప్పనిసరి: హాల్ మార్క్ రిజిస్ట్రేషన్ ఇలా...
జూన్ 1వ తేదీ నుండి బంగారు ఆభరణాలపై హాల్మార్క్ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. హాల్ మార్క్ లేకుండా ఈ జూన్ 1, 2021 నుండి బంగారు ఆభరణాలు విక్రయించలేరు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) రిజిస్టర్డ్ జ్యువెల్లర్స్ అందరికీ ఆదేశాలు జారీ చేసింది. 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్ల బంగారు ఆభరణాలపై తప్పనిసరిగా హాల్ మార్క్ ఉండాలని తెలిపింది. హాల్ మార్క్ ఉంటే ఇటు కస్టమర్, అటు బంగారం వ్యాపారి ఇద్దరికీ ప్రయోజనమని తెలిపింది. పసిడి నాణ్యతపై ఎలాంటి సందేహాలు ఉండవని స్పష్టం చేసింది.
మీ బంగారంపై హాల్ మార్క్ సరైందేనా? ఒక్కసారి చెక్ చేసుకోండి...
హాల్ మార్కింగ్
BIS హాల్మార్కింగ్ స్కీంలో ఆభరణాలకు రిజిస్ట్రేషన్ మంజూరు, అస్సైయింగ్ అండ్ హాల్ మార్కింగ్(A&H)కు గుర్తింపు ఉంటుంది. ఆభరణాల హాల్ మార్కింగ్ ప్రక్రియలో BIS-A&H సెంటర్లో నాణ్యతను తనిఖీ చేస్తారు. ఇక్కడ పరీక్షించిన అనంతరం A&H సెంటర్లో హాల్ మార్కింగ్ ముద్రను వేస్తారు. రిజిస్టర్డ్ జ్యువెల్లర్స్ హాల్ మార్కింగ్ కోసం BIS రికగ్నైజ్డ్ A&H సెంటర్కు ఆభరణాలను ఇస్తే, పరీక్ష అనంతరం హాల్ మార్కింగ్ వేస్తారు.
ఇలా దరఖాస్తు
BIS జ్యువెల్లర్స్ రిజిస్ట్రేషన్ను సులభతరం చేసింది. ఈ పూర్తి ప్రక్రియ కూడా మ్యాన్యువల్గా కాకుండా ఆన్లైన్ ద్వారా ఉంటుంది. జ్యువెల్లర్స్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఇందుకు వ్యాపారులు e-BIS పోర్టల్ www.manakonline.in కి వెళ్లాలి. సంబంధిత పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక దరఖాస్తుదారు BIS రిజిస్టర్డ్ జ్యువెలర్ అవుతారు.
ఛార్జీలు తక్కువే
BIS రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తక్కువగా నిర్ణయించారు. టర్నోవర్ రూ.5 కోట్ల కంటే తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్ ఫీజు రూ.7500, రూ.5 కోట్ల నుండి 25 కోట్లు టర్నోవర్ అయితే రూ.15,000, రూ.25 కోట్లకు పైగా టర్నోవర్ ఉంటే రూ.40 వేలు చెల్లించాలి. టర్నోవర్ రూ.100 కోట్లు దాటితే రూ.80 వేలు చెల్లించాలి. హాల్ మార్క్కు గతంలో 15 జనవరి 2021 వరకు గడువు ఇచ్చారు. జ్యువెల్లరీ అసోసియేషన్ డిమాండ్ మేరకు జూన్ 1వ తేదీ వరకు పొడిగించారు.