PMC దెబ్బ: బ్యాంకులు హఠాత్తుగా చేతులెత్తేస్తే.. ముందుగా ఇవి తెలుసుకోండి!
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (PMC) బ్యాంకులో భారీ కుంభకోణం జరిగినట్లుగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. బ్యాంకు పెద్దలు, హెచ్డీఐఎల్ ప్రమోటర్స్ ఒక్కటే వేల కోట్ల చీటింగ్కు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. పదకొండేళ్లుగా జరిగిన ఈ బాగోతంపై సోమవారం ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంకుకు 2008 నుంచి రూ.4,355.46 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఆర్బీఐ నియమించిన అడ్మినిస్ట్రేటర్ ఫిర్యాదు ఆధారంగా ముంబై ఆర్థిక నేర విభాగ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
ఏటీఎం క్యాష్ ఉపసంహరణ కొత్త రూల్స్ తెలుసుకోండి
పీఎంసీలో భారీగా అక్రమాలు
ఎఫ్ఐఆర్లో బ్యాంకు మాజీ చైర్మన్ వార్యం, ఎండీ జాయ్ థామస్, ఇతర సీనియర్ అధికారులు, హెచ్డీఐఎల్ డైరెక్టర్ వాధవన్ల పేర్లు ఉన్నాయి. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బ్యాంకు వర్గాలు నకిలీ ఖాతాలు సృష్టించి అక్రమాలకు తెరలేపినట్లుగా భావిస్తున్నారు. ఆర్బీఐ నివేదికను ఏమార్చాలని కూడా ప్రయత్నించారని తెలుస్తోంది. అయితే ఆర్బీఐ పరిశీలనతో ఇది వెలుగు చూసింది.
హెచ్డీఐఎల్ రుణమే 73 శాతం
మరోవైపు, ఈ సంక్షోభానికి కారణమైన హెచ్డీఐఎల్ స్వయంగా బ్యాంకుకు రూ.6500 కోట్లు బకాయి పడింది. బ్యాంకు మొత్తం రుణాల్లో ఇవే 73 శాతం. రూ.8,880 కోట్ల రుణాల్లో వీరిదే అధిక శాతం కావడం గమనార్హం. దాదాపు గత మూడేళ్లుగా హెచ్డీఐఎల్ ఈ రుణాలను చెల్లించడం లేదని బ్యాంకు మాజీ ఎండీ థామస్ చెప్పారు. అయితే తీసుకున్న రుణాల కంటే రెట్టింపు స్థాయిలో ఆస్తులను పూచీకత్తుగా పెట్టడంతో దీనికి సంబంధించిన రుణాలను ఆర్బీఐకి చెప్పలేదని అనడం గమనార్హం.
పీఎంసీ బ్యాంకు లోపాలు.. ఆర్బీఐ పరిమితులు..
PMC బ్యాంకు లోపాలు వెలుగు చూడటంతో ఆర్బీఐ దీనిపై కొన్ని పరిమితులు విధించింది. ఇందులో ముఖ్యంగా ఆరు నెలల పాటు కరెంట్, సేవింగ్ అకౌంట్ హోల్డర్లు తమ ఖాతా నుంచి రూ.1,000 కంటే ఎక్కువ తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత కస్టమర్ల ఉబ్బందులు గుర్తించి దానిని రూ.10,000కు పెంచింది. PMCపై ఆర్బీఐ నిబంధనలు ఖాతాదారులను ఆందోళనలోకి నెట్టింది.
బ్యాంకులు చేతులెత్తేస్తే కస్టమర్ల పరిస్థితి ఏమిటి?
అవసరానికి ఉపయోగపడతాయని లేదా సేవ్ చేద్దామని కస్టమర్లు బ్యాంకుల్లో డబ్బులు పెడుతుంటారు. కానీ ఇలా PMC ఉదంతంలా నిరర్థక ఆస్తులు పెరిగితే సామాన్య కస్టమర్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఇప్పుడు ఎందరిలోనే ఉదయిస్తోంది. అయితే ఖాతాదారులకు వచ్చే నష్టాన్ని భర్తీ చేసేందుకు డిపాజిట్ బీమా సౌకర్యం ఉంటుంది. మన దేశంలో చాలా బ్యాంకులు ఈ డిపాజిట్ బీమాను అమలు చేస్తున్నాయి.
బీమా కోసం DICGC
డిపాజిట్ బీమా కోసం డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ (DICGC) ఉంది. ఇది కస్టమర్ల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయదు. బ్యాంకులు చెల్లించే ప్రీమియంతో డిపాజిటర్లకు నిర్దేశించిన గరిష్ట మొత్తం వరకు డిపాజిట్ బీమా భద్రతను కల్పిస్తుంది.
DICGC ఏ బ్యాంకులకు వర్తిస్తుందంటే?b
DICGC అన్ని ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు, స్థానిక ప్రాంతీయ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులకు వర్తిస్తుంది. అలాగే మన దేశంలోని ఫాన్ బ్యాంక్ శాఖలు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర, ప్రాథమిక సహకార బ్యాంకులు, అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లోని డిపాజిటర్లకు బీమా సౌకర్యం ఉంటుంది.
ఈ సంఘాలకు వర్తించదు.. ఒకటి రెండు బ్యాంకులు మినహా...
ప్రాథమిక సహకార సంఘాలకు చెందిన డిపాజిట్లకు ఈ బీమా వర్తించదు.దేశ వ్యాప్తంగా ఒకటో లేదా రెండో పెద్ద బ్యాంకులు మినహా అన్నింటిలోను ఈ బీమా సౌకర్యం ఉంది. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్స్తో పాటు అన్ని రకాల కాలపరిమితి కలిగిన డిపాజిట్లకు ఈ ఇన్సురెన్స్ వర్తిస్తుంది.
రూ.1 లక్ష వరకు బీమా వర్తింపు
ఒక్కో డిపాజిటర్కు, యాజమాన్య హక్కు, హోదాను అనుసరించి ఒక్కో బ్యాంకులో గరిష్టంగా అసలు, వడ్డీ కలిపి రూ.1 లక్ష వరకు DICGC బీమా వర్తిస్తుంది. వేర్వేరు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను విడివిడిగా లెక్కలోకి తీసుకుంటారు. ఒకేరోజు రెండు బ్యాంకులు చేతులెత్తేస్తే ఆ రెండు బ్యాంకుల్లో గరిష్టంగా రూ.1 లక్ష చొప్పున బీమా వస్తుంది. ఓ కస్టమర్కు ఒకే బ్యాంకుకు చెందిన వివిధ శాఖల్లో డిపాజిట్స్ ఉంటే అతనికి కూడా గరిష్టంగా రూ.1 లక్ష వరకే బీమా వర్తిస్తుంది.
బాకీ పడితే సర్దుబాటు
ఉమ్మడి ఖాతా ఉన్నా లేదా ఒకే బ్యాంకులో వేర్వేరు శాఖల్లో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఉన్నప్పటికీ ఆ ఖాతాల పేర్లు ఒకేలా ఉంటే ఒకటిగానే పరిగణిస్తారు. అంటే గరిష్టంగా రూ.1 లక్ష బీమా వర్తిస్తుంది. పేర్లు వివిధ క్రమాల్లో ఉంటే మాత్రం వేర్వేరుగా పరిగణిస్తారు. అంతేకాదు, డిపాజిటర్ కనుక బ్యాంకుకు బాకీ పడితే దానిని సర్దుబాటు చేస్తారు.
మీ బ్యాంకులపై కన్నేయండి..
ప్రభుత్వం, ప్రైవేటు బ్యాంకులు ఆర్బీఐ నియంత్రణలో ఉంటాయి. కానీ కో-ఆపరేటివ్ బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్బీఐలు ఉమ్మడిగా నిర్వహిస్తాయి. కాబట్టి మీ బ్యాంకు కార్యకలాపాలపై మీరు ఎప్పుడూ కన్నేసి ఉంచాలి. ఇటీవలి కాలంలో ఎక్కువగా ఎన్పీఏలతో బ్యాంకులు ఇబ్బందులు పడుతున్నాయి. దీనిపై దృష్టి సారించాలి.