గ్రామవాలంటీర్లకు ఏడాదికి రూ.1,200 కోట్లు: అర్హత, వేతనం ఇవే... ఎప్పుడు తొలగిస్తారంటే?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. గ్రామ వాలంటీర్ల పోస్టుల నియామకానికి శనివారం వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 24వ తేదీ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలు, ట్రెయినింగ్ ఉంటుంది. 2 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. 18-35 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు. మైదాన్ ప్రాంతాల్లో ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో పదో తరగతి చదివిన వారు అర్హులు. అభ్యర్థులు ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోని వారు అయి ఉండాలి.
గుడ్న్యూస్: జగన్ సూచన, రూ.30,000 కోట్లతో కడపలో పరిశ్రమ? 75 శాతం ఉద్యోగాలు వారికే...
గ్రామ వాలంటీర్ పోస్టులు
గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఓ వాలంటీర్ను నియమిస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. ఇక నుంచి రేషన్ వంటి ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికే వాలంటీర్లు అందిస్తారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఆది, సోమవారాల్లో జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేస్తారు. సోమవారం నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఎంపీడీవో, తహసీల్దారు, పంచాయతీరాజ్ - గ్రామీణాభివృద్ధి కార్య నిర్వహణాధికారిలతో కూడిన భాగస్వామ్య కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. 50 శాతం పోస్టులను మహిళలకు కేటాయిస్తారు.
ఇలా దరఖాస్తు చేసుకోండి..
గ్రామ వాలంటీర్ల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ పోర్టల్ సిద్ధం చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు కేవలం ఈ పోర్టల్ ద్వారా http://gramavolunteer.ap.gov.in/VVAPP/VV/index.html మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాలంటీర్ల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా దినపత్రికల్లో ప్రకటనలు జారీ చేసి, ఈ నెల 24వ తేదీ (సోమవారం) నుంచి జూలై 5వ తేదీ వరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుంది.
విధివిధానాలు.. శిక్షణ.. అర్హతలు..
గ్రామ స్థానికత వాలంటీర్ల నియామకానికి ప్రాథమిక అర్హత. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని వారు దరఖాస్తు చేసుకోవడానికి కనీస అర్హత పదో తరగతి చదివి ఉండాలి. గ్రామాల్లో దరఖాస్తు చేసుకునేవారు ఇంటర్ చదివి ఉండాలి. వార్డు వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థి డిగ్రీ పాసై ఉండాలి. 18-35 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులు. దరఖాస్తుదారులకు జూలై 11నుంచి 25వ తేదీ మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆగస్టు 1వ తేదీన ఎంపికైన వారి జాబితాను వెల్లడిస్తారు. ఆగస్టు 5-10వ తేదీ వరకు శిక్షణ. అదే నెల 15వ తేదీ నుంచి విధుల్లోకి తీసుకుంటారు. నియామక ప్రక్రియలో మండలాన్ని యూనిట్గా తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడంతో పాటు అన్ని కేటగిరీల్లో సగం మంది మహిళలకే అవకాశం కల్పిస్తారు. ఎంపికైన వాలంటీర్లను గ్రామ పంచాయతీల పరిధిలో ఎక్కడెక్కడ నియమించాలో ఎంపీడీవో నిర్ణయిస్తారు. జిల్లాల వారీగా వాలంటీర్ల ఉద్యోగాల సంఖ్యను తేల్చేది కలెక్టర్లు.
ఏడాదికి రూ.1,200 కోట్ల ఖర్చు
అర్బన్ వాలంటీర్ల నియామక ప్రవేశ పరీక్షల కోసం రూ.63.50 లక్షలను, శిక్షణా కార్యక్రమాలకు రూ.6.88 కోట్లను మంజూరు చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే కోరింది. అర్బన్ వాలంటీర్లకు రూ.5వేల చొప్పున చెల్లించేందుకు ఏడాదికి రూ.486 కోట్లు ఖర్చు కానున్నాయని అంచనా. మొత్తంగా మొత్తం వాలంటీర్ల ఎంపిక, శిక్షణలకు ప్రాథమికంగా మొత్తం రూ.పదమూడున్నర కోట్ల వరకు అవుతుందని అంచనా. వాలంటీర్లకు ప్రతి నెల గౌరవ వేతనం రూ.5వేల చొప్పున ఇస్తారు. దీని కింద ఏటా రూ.1,200 కోట్లు అవసరమవుతాయని గుర్తించారు.
అధికారులకు తొలగించే అధికారం
ఆశించినస్థాయిలో వాలంటీర్లు పనితీరు కనబరచకుంటే అధికారులకు అలాంటి వారిని తొలగించే అధికారం ఉంది. లంచాలు తీసుకోవడం, అవినీతికి పాల్పడటం చేస్తే తొలగిస్తారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ పేర్కొనే విధులు, బాధ్యతల మేరకు వాలంటీర్లు పని చేయాలి. మండలస్థాయిలో ఎంపీడీవోలు, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు వీరి పని తీరును సమీక్షిస్తారు. కలెక్టర్ ఆద్వర్యంలో జిల్లా స్థాయిలో ప్రత్యేక పరిశీలన వ్యవస్థ పని చేస్తుంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో అవినీతికి తావులేకుండా చేసే ఉద్దేశ్యంతో పాటు కుల, మత, వర్గ, రాజకీయ బేధాలు లేకుండా అర్హులందరికీ పథకాలు చేరవేయడం కోసం ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకు వచ్చింది.
ఇంటి ముందుకే ప్రభుత్వ సవలు
ప్రభుత్వ సేవలు ఇంటి ముందుకే తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టారు. సంక్షేమ పథకాల్లో అవకతవకలు, అవినీతి, అక్రమాలను నిరోధిస్తూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలనేది లక్ష్యమని జీవోలో పేర్కొన్నారు. తమ దృష్టికి వచ్చే ప్రజా సమస్యలను కూడా గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేలా ఉండాలి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తులు ఎప్పుడు స్వీకరిస్తారు - జూన్ 24 నుంచి జూలై 5వ తేదీ వరకు
ఇంటర్వ్యూలు - జూలై 11 నుంచి 25వ తేదీ వరకు
ట్రెయినింగ్ - మండలాల వారీగా ఆగస్ట్ 5-10వ తేదీ వరకు. ఆగస్ట్ 15 నుంచి విధుల్లోకి హాజరు
అర్హత - 30-6-2019 నాటికి 18-35 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.
గిరిజన ప్రాంతాల్లోని వారు పదో తరగతి, మైదాన్ ప్రాంతాల్లోని వారు ఇంటర్ చదివి ఉండాలి.