మ్యూచువల్ ఫండ్ యూనిట్లను తనఖాపెట్టి రుణం పొందడమెలా?
అత్యవసర సందర్భాల్లో డబ్బు సరిపడా లేనప్పుడు 3 నెలల నుంచి ఏడాది కాలానికి ఫండ్ యూనిట్లను తనఖా పెట్టి రుణం పొందొచ్చు. బ్యాంకుల్లో, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో రుణాలు ఇస్తాయి.
బీమా పాలసీ, షేర్ల మాదిరిగానే మ్యూచువల్ ఫండ్ యూనిట్లను తనఖా పెట్టి రుణం పొందే సౌలభ్యం ఉంది. ఈ సదుపాయం బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్కు దగ్గరగా ఉంటుంది. అత్యవసర సందర్భాల్లో డబ్బు సరిపడా లేనప్పుడు 3 నెలల నుంచి ఏడాది కాలానికి ఫండ్ యూనిట్లను తనఖా పెట్టి రుణం పొందొచ్చు. బ్యాంకుల్లో, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో రుణాలు ఇస్తాయి.
ఎలాంటి ఫండ్ల తనఖా?
ఈక్విటీ, డెట్ ఓరియెంటెడ్, హైబ్రిడ్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లు ఏదైనా సరే తనఖా పెట్టేసి రుణం పొందొచ్చు. అయితే వ్యక్తిగత ఆర్థిక నిపుణులు మాత్రం ఈక్విటీ ఓరియెంటెడ్ పథకాలను మాత్రమే తనఖా పెట్టి రుణం పొందమంటారు. డెట్, లిక్విడ్ ఫండ్ల కన్నా ఈ విషయంలో ఈక్విటీలకే ప్రాధాన్యమివ్వమని చెబుతారు. రుణ కాలపరిమితి, రుణ మొత్తాన్ని బట్టి రుణమిచ్చే ఆర్థిక సంస్థలు 10 నుంచి 11శాతం వడ్డీని వసూలుచేస్తాయి.
ఎంత ఇస్తారు?
సాధారణంగా తనఖా పెట్టిన మ్యూచువల్ ఫండ్ యూనిట్ల విలువలో 60 నుంచి 70శాతం రుణంగా పొందవచ్చు. ఇది మ్యూచువల్ ఫండ్ నిర్వహించే సంస్థను బట్టి మారుతూ ఉండొచ్చు.
దరఖాస్తు ఇలా...
మ్యూచువల్ ఫండ్ యూనిట్లు డీమ్యాట్ రూపంలో ఉంటే రుణ మంజూరు, రుణ చెల్లింపు వేగంగా జరిగిపోతుంది. అదే ఫిజికల్ రూపంలో ఉంటే, తొలుత ఒక రుణ ఒప్పందాన్ని రుణం అందించే ఆర్థిక సంస్థకు సమర్పించాల్సి ఉంటుంది.
రుణమిచ్చే సంస్థ ఆ తర్వాత కార్వీ, క్యామ్స్ లాంటి మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రార్ సంస్థలను రుణ మొత్తానికి సమానమైన ఫండ్ యూనిట్లను మార్కింగ్ చేయమంటుంది. దీని ధ్రువీకరణ పూర్తయ్యాక రుణ మంజూరు జరుగుతుంది.
ప్రత్యేకమైన ప్రయోజనమిదే..
మ్యూచువల్ ఫండ్ యూనిట్లను తనఖా పెట్టి రుణం పొందడంలో ప్రత్యేకమైన ప్రయోజనమేమిటంటే... పెట్టుబడి సొమ్ము అలాగే కొనసాగుతూ వాటిపై రాబడి వస్తుంది. అదే విధంగా రుణం రూపంలో సొమ్మూ అందుబాటులోకి వస్తుంది.