రాజీవ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలుసా, టైం ఎవరు మార్చారంటే: 10 ఆసక్తికర అంశాలు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మోడీ ప్రభుత్వానికి, సీతారామన్కు ఇది రెండో బడ్జెట్. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఈ బడ్జెట్ పైన అందరిలోను ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర భారతావని ప్రవేశ పెట్టిన బడ్జెట్లోని కొన్ని ఆసక్తికర సంఘటనలు తెలుసుకుందాం..
బడ్జెట్ 2020: మరిన్ని కథనాలు చదవండి
తొలి మధ్యంతర బడ్జెట్
స్వతంత్ర భారతావనిలో 26 నవంబర్ 1947న తొలిసారి మధ్యంతర బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. దీనిని తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణుకం శెట్టి ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి స్వల్పకాలికం కోసం దీనిని ప్రవేశ పెడుతున్నారు.
ప్రధానిగా బడ్జెట్
1969లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. 14 అతిపెద్ద బ్యాంకులను జాతీయం చేయాలని ఇందిరా గాంధీ నిర్ణయించారు. అయితే నాటి ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ని సంప్రదించకుండానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదనలు ఉన్నాయి. ఆమె నిర్ణయంపై అసంతృప్తితో మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. దీంతో ఇందిరా ఆర్థిక బాధ్యతలు స్వీకరించి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆర్థిక బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా మంత్రి ఇందిరా గాంధీ.
ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టింది ఎవరంటే?
మొరార్జీ దేశాయ్ ఎక్కువసార్లు బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఆయన 10 సార్లు బడ్జెట్ను ప్రవేశ పెట్టగా, చిదంబరం 9సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8సార్లు ప్రవేశ పెట్టారు.
హల్వా వేడుక
బడ్జెట్ను ప్రవేశ పెట్టడానికి పది రోజుల ముందు హల్వా వేడుక నిర్వహిస్తారు. తీపితో ఓ ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం భారత సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. హల్వా వేడుక అనంతరం బడ్జెట్ ప్రతులు ప్రింటింగ్కు వెళ్తాయి. బడ్జెట్తో సంబంధం ఉన్న అధికారులకు బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజు వరకు బయటి వారితో సంబంధం ఉండదు.
రాజీవ్ గాంధీ బడ్జెట్ ప్రవేశ పెట్టారు
1984లో ఇందిరా గాంధీ హత్య అనంతరం రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా, వీపీ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అయితే అనూహ్యంగా 1987లో కేబినెట్ నుంచి వీపీ సింగ్ను డిస్మిస్ చేశారు. ఆ తర్వాత ఆయన లోకసభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వీపీ సింగ్ రాజీనామా నేపథ్యంలో 1987-88 బడ్జెట్ను రాజీవ్ గాంధీ ప్రవేశ పెట్టారు. ప్రధానిగా ఆయన బడ్జెట్ను ప్రవేశ పెట్టారు.
డ్రీమ్ బడ్జెట్
ఆదాయపు పన్ను తగ్గించడం, కార్పోరేట్ పన్ను తగ్గించడం వంటి వివిధ సంస్కరణల కారణంగా 1997-98 బడ్జెట్ను డ్రీమ్ బడ్జెట్గా చెబుతారు. దీనిని పీ చిదంబరం సమర్పించారు.
రాజ్యాంగ సంక్షోభం
ఐకే గుజ్రాల్ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభం కారణంగా 1998-99 బడ్జెట్ ఎలాంటి చర్చ లేకుండా పాస్ అయింది. బడ్జెట్ ఆమోదం కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో మార్పు
1999లో నాటి ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో మార్పును తీసుకు వచ్చారు. అంతకుముందు బడ్జెట్ను ఫిబ్రవరి చివరి వర్కింగ్ డే సాయంత్రం 5 గంటలకు ప్రవేశ పెట్టేవారు. దీనిని ఉదయం 11 గంటలకు ప్రవేశ పెట్టడం యశ్వంత్ సిన్హా నుంచి ప్రారంభమైంది.
రెండు బడ్జెట్లు కలిపి
2016కు ముందు కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్ వేరుగా ఉండేది. 92 ఏళ్ల పాటు అలాగే బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. 2016లో మోడీ ప్రభుత్వంలో రెండు బడ్జెట్లను క్లబ్ చేశారు.
బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ మార్పు
2017లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హయాంలో బడ్జెట్ ప్రవేశ పెట్టే తేదీ మారింది. అంతకుముందు మరుసటి ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1వ తేదీన బడ్జెట్ను ప్రవేశ పెట్టేవారు. దీనిని 2017లో ఫిబ్రవరి 1కి మార్చారు.