గ్రామీణ, చిన్న పట్టణాల వారికి గుడ్న్యూస్: ఇక రోజుకు రూ.100 ఇన్వెస్ట్ చేయవచ్చు
గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో ఉంటున్నవారికి శుభవార్త! ప్రతిరోజు రూ.100 మ్యూచువల్ ఫండ్స్ సిప్ ప్లాన్ను లాంచ్ చేసింది జెడ్ఫండ్స్. ఈ మేరకు మంగళవారం ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూట్ ప్లాట్ఫామ్ (జెడ్ఫండ్స్) MFలో సిప్ రూపంలో రోజుకు రూ.100 ఇన్వెస్ట్ చేసే వెసులుబాటును తీసుకు వచ్చినట్లు తెలిపింది. ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణాల్లో నివసించే వారిని దృష్టిలో పెట్టుకొని దీనిని తీసుకు వచ్చింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్, HDFC మ్యూచువల్ ఫండ్స్, టాటా మ్యూచువల్ ఫండ్ సహకారంతో దీనిని ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇతర ఫండ్ హౌస్లతోను చర్చలు జరుపుతోంది.
రోజువారీ సంపాదన కాబట్టి
గ్రామీణ, చిన్న పట్టణాలలో(టైర్-2, టైర్-3, టైర్-4) నెలవారీ ఆదాయం కాకుండా రోజువారీ వేతనం పొందే వాళ్లే ఎక్కువగా ఉంటారు. వీరిని సిప్లో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో దీనిని తీసుకు వచ్చింది. కనీసం రూ.100 ఇన్వెస్ట్తో వీళ్లు తమ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించవచ్చునని తెలిపింది. అతి తక్కువ సమయంలో 3000కు పైగా రోజువారీ సిప్స్ను తమ ప్లాట్ఫాం పైన నమోదు చేసింది. FY23 నాటికి 1 లక్ష డెయిలీ సిప్లను లక్ష్యంగా పెట్టుకుంది.
వారికి ప్రయోజనం
రోజూ రూ.100 కనీస పెట్టుబడి రోజువారీ సంపాదకులకు, చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తుందని, ఇది రోజువారీ ఆదాయం నుండి తమ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఉపకరిస్తుందని జెడ్ఫండ్స్ తెలిపింది. భారత్లో మ్యూచువల్ ఫండ్స్ను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకు రావడానికి ఇది ఒక మంచి మార్గమని, బ్రేకింగ్ కాన్సెప్ట్ అని జెడ్ఫండ్స్ సీఈవో, కో-ఫౌండర్ మనీష్ కొఠారీ అన్నారు. నాన్-మెట్రోలలో 54 శాతం మందికి పైగా స్వయం ఉపాధి పొందుతున్నారని, వారికి సాధారణంగా రోజువారీ సంపాదన ఉంటుందని, అలాంటి వారి చిట్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారని, అందుకే రోజువారీ సిప్ రూ.100ను ప్రవేశ పెట్టామన్నారు. 2021 క్యాలెండర్ ఏడాదిలో జెడ్ఫండ్స్ మంత్లీ సిప్ బుక్ రూ.4 కోట్లు రిజిస్టర్ చేసింది. AUM రూ.350 కోట్లు దాటింది.
మరింతమందికి పెట్టుబడులు
జెడ్ఫండ్స్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నందుకు ఆనందంగా ఉందని, ఎందుకంటే రూ.100 రోజువారీ మ్యూచువల్ ఫండ్ సిప్ భారత్లోని మరింతమంది పెట్టుబడుల ప్లాన్ను తీసుకు వెళ్తుందని, గ్రామీణ, చిన్న పట్టణాలకు మ్యూచువల్ ఫండ్స్ సిప్ వెళ్తుందని, ఇది వారికి ప్రయోజనం చేకూరుస్తుందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సహా ఇతర భాగస్వామ్య పక్షాలు అభిప్రాయపడ్డాయి.