మున్ముందు మరింత నష్టాలు ఉండవచ్చు, వెనక్కి తీసుకోవద్దు!
స్టాక్ మార్కెట్లు ఇటీవల భారీగా నష్టపోతున్నాయి. సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్టం 62,245 కాగా, ప్రస్తుతం 52,541 పాయింట్ల వద్ద ఉంది. సూచీలు వరుసగా నాలుగో రోజైన నేడు కూడా నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఈ రోజు (జూన్ 15, 2022) 152 పాయింట్లు క్షీణించింది. మొత్తంగా ఆల్ టైమ్ గరిష్టంతో సెన్సెక్స్ దాదాపు 10,000 పాయింట్లు తక్కువగా ఉంది. నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టం 18,604 పాయింట్లతో పోలిస్తే దాదాపు 3000 పాయింట్లు తక్కువగా ఉంది. నేడు 40 పాయింట్లు క్షీణించి 15,692 పాయింట్ల వద్ద ముగిసింది.
యూఎస్ ఫెడ్తో పాటు ఆర్బీఐ ఇటీవల రెపో రేటు పెంచడం స్టాక్ మార్కెట్ల పైన ప్రభావం చూపింది. దీనికి తోడు ద్రవ్యోల్భణ భయాలు, కరోనా కొత్త కేసులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ఆర్థిక రికవరీ కోసం వడ్డీ రేట్లను పెంచడం వేగవంతం చేశాయి. ఇది ప్రపంచ, దేశీయ మార్కెట్ పైన ప్రభావం చూపుతోంది.
ప్రస్తుతం మార్కెట్లు తీవ్ర ఊగిసలాటలో ఉన్నాయి. సెన్సెక్స్ ఆరు నెలల కాలంలో 5000 పాయింట్లకు పైగా నష్టపోయింది. గత ఐదు రోజుల్లోనే 2000 పాయింట్లకు పైగా క్షీణించింది. అక్టోబర్ నెలలో ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లను తాకింది. అంటే గత ఎనిమిది నెలల కాలంలో దాదాపు 10వేల పాయింట్లు క్షీణించింది. ఈ నేపథ్యంలో మార్కెట్ మరింత క్షీణిస్తుందనే భయంతో పెట్టుబడిదారులు డబ్బులు వెనక్కి తీసుకుంటారు.
అయితే దీర్ఘకాలానికి పెట్టుబడులు ఉపసంహరించుకోకుండా ఉండటమే మంచిదని, కానీ ఆయా రంగాన్ని, స్టాక్ చరిత్రను, వృద్ధిని పరిగణలోకి తీసుకోవాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మున్ముందు మరికొద్ది వారాలు సూచీలు ఇలాగే నష్టాల్లో లేదా ఊగిసలాటలో ఉండవచ్చునని, అలా అని మంచి స్టాక్స్ నుండి డబ్బులు వెనక్కి తీసుకోవడం చేయవద్దని సూచిస్తున్నారు.