ద్రవ్యోల్బణం భయపెడుతోంది.. ఏం చేస్తే మీకు ప్రయోజనం ఉంటుందో తెలుసా?
సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయల నుంచి మొదలు ఏవి కొనుగోలు చేసినా జేబులు గుల్ల అవుతున్నాయి. ధరల పెరుగుదల తీరును ప్రతిభింబించే రిటైల్ ద్రవ్యోల్భణం అక్టోబర్ నెలలో 4.62 శాతానికి ఎగబాకింది. ఇది 16 నెలల గరిష్ట స్థాయి కావడంతో అటు సర్కారు, ఇటు భారత రిజర్వ్ బ్యాంకు మదిలో దడ మొదలైంది. భారత రిజర్వ్ బ్యాంకు ద్రవ్యోల్భణం మధ్యంతర లక్ష్యం 4 శాతం. అయితే ఈ గీతను ద్రవ్యోల్బణం దాటేసిన నేపథ్యంలో ఆర్బీఐ పునరాలోచనలో పడిపోయింది. ద్రవ్యోల్బణం పెరిగితే ఏమవుతుంది. దాని ప్రభావం సామాన్యులపై ఎలా ఉంటుంది. ఈ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో చూద్దాం...
మీరు రిటైల్ ఇన్వెస్టరా? అయితే 'సిప్' చేయొచ్చు..
వడ్డీ రేట్లు భగభగ
ఇంతకాలం ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉంది కాబట్టి భారత రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చింది. దీనివల్ల మనం బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టాయి. దీనివల్ల ప్రయోజనమే కలిగింది. అయితే ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతున్న కారణంగా ఆర్బీఐ మళ్ళి వడ్డీ రేట్లను పెంచడానికి అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే మీ మీరు తీసుకున్న, తీసుకోబోయే రుణాలపై వడ్డీ రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్యాంకులు రేపో రేటు లాంటి ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లతో అనుసంధానం చేశాయి కాబట్టి రేపో రేటు పెరగగానే మీ వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. అందుకే కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది.
మీరు ఇప్పటికే రుణం తీసుకొని ఉంటే దానిపై చెల్లించే నెలవారీ వాయిదా మొత్తం మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ వడ్డీ భారం నుంచి తప్పించుకోవాలనుకుంటే మీ రుణంలో కొంత భాగాన్ని చెల్లించండి. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. అయితే ముందస్తుగా కొంత మొత్తం చెల్లించడం వల్ల బ్యాంకులు మీ వద్ద నుంచి కొంత చార్జీ వసూలు చేయవచ్చు. దీని గురించి మీ బ్యాంకును అడిగి తెలుసుకోండి. తక్కువ చార్జీలు ఉంటే కొంత మొత్తాన్ని చెల్లించే ఆలోచన చేయవచ్చు.
బంగారం కొనుగోలు చేయవచ్చు..
దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ పెరుగుదల ప్రభావం నుంచి తట్టుకోవడానికి బంగారం ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతుంటారు. బంగారం సరఫరా పరిమితంగా ఉంటుంది. కానీ డిమాండ్ మాత్రం ఎక్కువ ఉంటుంది. డిమాండ్ మూలంగా ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బంగారం కొనుగోలు చేయడం వల్ల ప్రయోజనమే ఉంటుంది. అయితే మీ మొత్తం పెట్టుబడుల్లో బంగారం కోసం పది శాతం కేటాయిస్తే సరిపోతుందని మార్కెట్ పండితులు చెబుతుంటారు. అంతర్జాతీయ షేర్లు లేదా విదేశీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టె ఆలోచన చేయవచ్చు. వీటి వల్ల మంచి రిటర్న్ లు రావడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే దేశ కరెన్సీ విలువ తగ్గుతుంది. ఇదే సమయంలో విదేశీ కరెన్సీ విలువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రయోజనం ఎక్కువ ఉంటుందని అంటారు.
ఈక్విటీల్లో పెట్టుబడులు
స్టాక్ మార్కెట్లు ముందడుగు వేస్తున్నాయి. షేర్ల ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో పెట్టుబడులపై మంచి రిటర్న్ లు వస్తాయి. ద్రవ్యోల్బణం పెరిగితే కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను కూడా పెంచుతాయి కాబట్టి కంపెనీ రాబడులు ఆ మేరకు సర్దుబాటు అవుతాయి. మారుతున్న పరిణామాలకు అనుగుణంగా స్వల్ప కాలంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. అందుకే దీర్ఘకాలిక దృక్పథంతో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.
పెట్టుబడుల్లో మార్పు..
ద్రవ్యోల్బణం పెరిగితే ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచుతాయి. దీనివల్ల మీ రీకరింగ్, ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. అయితే దీనిపై పెరిగిన ద్రవ్యోల్బణ ప్రభావంతో పాటు పన్నుల ప్రభావం ఉంటుంది. వీటిని కూడా లెక్కలోకి తీసుకోవాలి. కాబట్టి ఎక్కువ రిటర్న్ లు ఇచ్చే వాటిపై ద్రుష్టి పెట్టడం మంచిది. తక్కువ రిటర్న్ వస్తుందని భావిస్తే వెంటనే పెట్టుబడుల వ్యూహాల్లో మార్పులు చేసుకోవడం మంచిది.