ఆ స్టాక్తో 6 రోజుల్లో రూ.58 కోట్లు లాభపడిన రాకేష్ ఝున్ఝున్వాలా, మరో స్టాక్ మాత్రం భారీ పతనం
ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా గత వారం రోజుల్లోనే ఓ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో రిటర్న్స్ వచ్చాయి. వారం క్రితం ఆయన కొనుగోలు చేసిన జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు ఆయనకు లక్ష్మీ కటాక్షాన్ని అందించాయి. ఈ రోజు అయితే ఈ స్టాక్ ఏకంగా 30 శాతానికి పైగా లాభపడింది. జీ ఎంటర్టైన్మెంట్ ఆరు రోజుల్లో 61 శాతానికి పెరిగింది. రాకేష్కు చెందిన రేర్ ఎంటర్ప్రైజెస్ వారం క్రితం అంటే సెప్టెంబర్ 14న జీఎంటర్టైన్మెంట్లోని 50 లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. ఆయన కొనుగోలు చేసినప్పుడు షేర్ వ్యాల్యూ రూ.220.44. యాభై లక్షల షేర్లకు ఆయన వెచ్చించిన మొత్తం రూ.110 కోట్లు. అయితే వారం రోజులుగా జీ ఎంటర్టైన్మెంట్ అదరగొడుతోంది. దీంతో ఆరు సెషన్లలో 61 శాతం లాభాలను ఆర్జించారు.
వారం రోజులుగా అదుర్స్
గతవారం రోజులుగా కంపెనీ నుండి సానుకూల సంకేతాలు రావడంతో షేర్ వ్యాల్యూ పెరుగుతూ వచ్చింది. ఈ రోజు సోనీ పిక్చర్స్తో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం ప్రకటించడంతో కంపెనీ షేర్ వ్యాల్యూ ఓ దశలో 39 శాతం లాభపడింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.355.40ను తాకింది. చివరకు 31.86 శాతం లాభంతో 337 వద్ద ముగిసింది. దీంతో రాకేష్ ఒక్కో షేర్ వ్యాల్యూ వారం రోజుల్లో రూ.116కు పైగా పెరిగింది. ఈ లెక్కన జీ ఎంటర్టైన్మెంట్లో ఆయన వాటా వ్యాల్యూ నేటితో రూ.168.33 కోట్లకు చేరుకుంది. అంటే వారంలో ఆయన రూ.58.33 కోట్ల లాభం ఆర్జించారు.
ఒప్పందం ఎఫెక్ట్
సోనీ పిక్చర్స్తో విలీనానికి సంబంధించిన ప్రకటనను జీ ఎంటర్టైన్మెంట్ బుధవారం చేసింది. బోర్డ్ డైరెక్టర్స్ మంగళవారం రాత్రి ఏకగ్రీవంగా దీనికి ఆమోదం తెలిపారు. మెర్జర్ ఎంటిటీకి పునీత్ గోయెంకా ఎండీ మరియు సీఈవోగా ఉంటారు. విలీనం తర్వాత జీ ఎంటర్టైన్మెంట్కు 47.07 శాతం వాటాలు ఉంటాయి. సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియాకు 52.93 శాతం వాటా ఉంటుంది. విలీనం తర్వాత సోనీ పిక్చర్స్ 1.575 బిలియన్ డాలర్ల నిధులను ఇన్వెస్ట్ చేస్తుంది. దక్షిణాసియాలో ప్రధాన మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీగా నిలబెట్టేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని తెలిపింది. టర్మ్ షీట్ ప్రకారం ప్రమోటర్ ఫ్యామిలీ షేర్ హోల్డింగ్ను ప్రస్తుతం ఉన్న 4 శాతం నుండి 20 శాతానికి పెంచుకోవచ్చు.
ఈ స్టాక్ మాత్రం డౌన్
ఇదిలా ఉండగా, రాకేష్ ఝున్ఝున్వాలా సెయిల్లో కూడా ఇన్వెస్ట్ చేసారు. అయితే ఈ స్టాక్ తన 52 వారాల గరిష్టం నుండి 26 శాతం మేర పడిపోయింది. 52 వారాల గరిష్టం రూ.151కి పైన ఉండగా, ప్రస్తుతం రూ.111 వద్ద ఉంది. రాకేష్ ఝున్ఝున్వాలా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ స్టాక్లో 1.39 శాతం వాటాను కొనుగోలు చేశారు. మే నెలలో రూ.151 వద్ద ఉన్న స్టాక్, ఆ తర్వాత క్రమంగా క్షీణించింది. ఈ స్టీల్ మేకర్ కంపెనీలో రాకేష్ స్టేక్ రూ.640 కోట్లు. సెయిల్ మద్దతు స్థాయి రూ.101 నుండి రూ.103గా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలో ఇది కోలుకుంటే రూ.116 నుండి రూ.123కి చేరుకోవచ్చునని కూడా చెబుతున్నారు.