sovereign gold bonds: మే 24వ తేదీ నుండి రెండో విడత సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం
సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం 2021-22 సిరీస్ 2 స్కీం సబ్స్క్రిప్షన్ సోమవారం నుండి ప్రారంభం కానుంది. తొలి విడత గోల్డ్ బాండ్స్ మే 21వ తేదీన ముగియనుంది. ప్రభుత్వం గోల్డ్ బాండ్ ధరను (ఒక గ్రాముకు) రూ.4,842గా నిర్ణయించింది. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసేవారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఉంటుంది. రేపటి నుండి (సోమవారం, మే 24) ఐదు రోజుల పాటు సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం ఇష్యూ ఆఫర్ చేస్తున్నారు. 24వ తేదీ నుండి 28 తేదీ వరకు కొనుగోలు చేయవచ్చు. గత ఇష్యూలో గ్రాము బంగారం ధర రూ.4,777గా నిర్ణయించగా, ఈ ఇష్యూలో పెరిగింది.
గుడ్న్యూస్, ఏప్రిల్ 2022 నుండి మొబైల్ వ్యాలెట్లు, ప్రీపెయిడ్ కార్డ్స్ మార్చుకోవచ్చు
ఏమిటీ SGB, ధర ఎలా నిర్ణయిస్తారు?
కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ సావరీన్ గోల్డ్ బాండ్స్ (SGB)ని ఆఫర్ చేస్తోంది. మే 2021 నుండి 2021 సెప్టెంబర్ వరకు 6 విడతల్లో బాండ్స్ను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్స్క్రిప్షన్ కాలానికి ముందు వారంలోని చివరి మూడు వర్కింగ్ డేస్ 999 స్వచ్ఛత బంగారం సగటు ధర ఆధారంగా బాండ్ వ్యాల్యు 1 గ్రాము బంగారానికి రూ.4842ని నిర్ణయించింది.
ఎవరు ఇన్వెస్ట్ చేయవచ్చు
ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) కింద ఏ రెసిడెంట్ అయినా ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇండివిడ్యువల్స్, HUF, ట్రస్ట్లు కూడా కొనుగోలు చేయవచ్చు. మైనర్ల తరఫున గార్డియన్ పెట్టుబడిగా పెట్టవచ్చు. సావరీన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి వోటర్ ఐడీ, ఆధార్ కార్డు, పాన్ లేదా ట్యాన్, పాస్పోర్ట్ వంటివి అవసరం.
ఎంతమేర కొనుగోలు చేయవచ్చు
సావరీన్ గోల్డ్ బాండ్ ద్వారా కనీసం ఒక గ్రామును కొనుగోలు చేయాలి. ఇండివిడ్యువల్స్, HUF నాలుగు కిలోల వరకు పెట్టుబడిగా పెట్టవచ్చు. ఇతర అర్హత కలిగిన ఎంటిటీలు 20 కిలోల వరకు కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ బాండ్ మెచ్యూరిటీ పీరియడ్ ఎనిమిది సంవత్సరాలు. అయితే ఇన్వెస్టర్లు అయిదేళ్లకు ఉపసంహరించుకోవచ్చు.
కొనుగోలు ఇలా
ఎస్బీఐ ద్వారా మాత్రమే కాకుండా ఇతర మార్గాల్లోను గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. కమర్షియల్ బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆర్బీఐ నియమించిన పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల నుండి కూడా బంగారు బాండ్లను కొనుగోలు చేయవచ్చు.
భౌతిక బంగారం డిమాండ్ను తగ్గించడానికి, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు ఉపయోగించే ఆర్థిక పొదుపుగా మార్చడానికి 2015 నవంబర్ నెలలో సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.