బంగారం, వెండి బౌన్స్ బ్యాక్: మళ్లీ ఆ దిశగా పరుగులు
కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది (2020)లో బంగారం, వెండి ధరలు భారీగా ఎగిశాయి. ఆగస్ట్ 7వ తేదీన గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200కు, సిల్వర్ ఫ్యూచర్స్ రూ.79,000 క్రాస్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా 2,072 డాలర్లకు, సిల్వర్ ఫ్యూచర్స్ 29 డాలర్లను క్రాస్ చేసింది. అయితే ఆ తర్వాత కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ నేపథ్యంలో పసిడి, వెండి ధరలు దారుణంగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ 24 డాలర్ల దిగువకు, బంగారం 1700 డాలర్ల దిగువకు వచ్చింది. దేశీయ మార్కెట్లోను పసిడి రూ.44వేల దిగువకు, వెండి రూ.60వేల దిగువకు వచ్చింది. కానీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తిరిగి ఈ విలువైన లోహాల ధరలు పెరుగుతున్నాయి.
మళ్లీ పుంజుకుంటున్న ధరలు
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. మున్ముందు మరింతగా పెరగవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. తక్కువ వడ్డీ రేట్ల కొనసాగింపు, ద్రవ్యోల్భణ ప్రభావం వంటి వివిధ కారణాలు బంగారం, వెండి ట్రెండ్ తిరిగి పుంజుకోవడానికి మరింత ఊతమిచ్చాయని అంటున్నారు. గత ఏడాది బంగారం 45 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఆల్ టైమ్ గరిష్టంతో పసిడి ధరలు ప్రస్తుతం 25 శాతం క్షీణించాయి. అదే సమయంలో వెండి ఆల్ టైమ్ గరిష్టంతో 15 శాతం పడిపోయింది.
మళ్లీ జంప్ చేసే దిశగా
కరోనా సెకండ్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈక్విటీస్ నుండి సురక్షిత పెట్టుబడిగా భావించే బులియన్ మార్కెట్ దిశగా దృష్టి సారిస్తున్నారని అంటున్నారు. అలాగే బలహీనపడుతున్న డాలర్, యూఎస్ బాండ్ యీల్డ్స్ ప్రభావం బంగారం పైన ఉంటుందని, ఈ ధరలు పెరగవచ్చునని అంటున్నారు. గత ఏడాది బులియన్ మార్కెట్ జంప్ చేసినప్పటికీ, మూడు నెలలుగా దాదాపు స్థిరంగా కనిపిస్తోందని, ఇప్పుడు మళ్లీ పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మళ్లీ ఆ దిశగా పసిడి
బంగారం ధరలు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలో గతవారం భారీగా పెరిగి రూ.47,760 వద్ద, వెండి రూ.71,500 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఏకంగా 1800 డాలర్లు దాటింది. గోల్డ్ ఫ్యూచర్స్ 1,831.95 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 27.558 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. బంగారం ధరలు ఈ వారం 49వేల మార్కు చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.