పెరిగిన బంగారం ధరలు, వెండి రెండ్రోజుల్లో రూ.2,000 పెరుగుదల: పసిడి పరుగు తగ్గిందా?
బంగారం ధరలు నేడు (జూలై 21, మంగళవారం) పెరిగాయి. ఎంసీఎక్స్లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.12 శాతం పెరిగి రూ.49,085 పలికింది. ఈ నెల ప్రారంభంలో రూ.49,348 గరిష్ట రికార్డుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టింది. తిరిగి గరిష్ట రికార్డ్ సమీపానికి చేరుకుంది. వెండి ధర ఎంసీఎక్స్లో రూ.1,050 పెరిగి కిలో రూ.55,050కి చేరుకుంది. అంతకుముందు సెషన్లో రూ.1,150 పెరిగింది.
94% తగ్గిన బంగారం దిగుమతులు, భారీగా దిగివచ్చిన వాణిజ్యలోటు
రెండు రోజుల్లో రూ.2,000 పెరుగుదల
వెండి ధర కేవలం రెండు రోజుల్లోనే రూ.2,100కు పైగా పెరిగింది. నిన్న రూ.1,150 పెరగగా, నేడు రూ.1,050 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 9 ఏళ్ల గరిష్టానికి సమీపంలో ఉంది. స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్స్ ధర 1,818.53 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు సెషన్లో 1,823 డాలర్లకు కూడా చేరింది. 2011 సెప్టెంబర్ నుండి అది గరిష్టం. అలాగే వెండి నాలుగేళ్ల గరిష్టానికి చేరుకుంది.
బంగారం పెరుగుదల.. అందుకే
బంగారం ధర పెరగడానికి ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ మారకం తగ్గడం కూడా ఓ కారణం. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ మారకం నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల ప్రభావం బంగారంపై ఉంటుంది. భౌతిక బంగారం వినియోగించే దేశాల నుండి డిమాండ్ తగ్గింది. ఉదాహరణకు భారత్ దిగుమతులు ఏప్రిల్-జూన్ మధ్య ఏకంగా 94 శాతం తగ్గాయి. ఈ ప్రభావాల వల్ల బంగారం అధికంగా పెరగడం లేదు. ఈక్విటీ మార్కెట్లు కూడా పుంజుకోవడం పసిడిపై ఒత్తిడిని తగ్గించింది. భౌగోళిక టెన్షన్స్ పెరిగి ఉంటే లేదా భౌతిక బంగారం వినియోగించే దేశాల నుండి డిమాండ్ ఉంటే, ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోతే మరింతగా పెరిగే అవకాశముండేది. ప్రస్తుతం డాలర్ మారకం తగ్గడం వంటి కారణాలతో కాస్త పెరుగుతున్నాయి. అయితే ఎంసీఎక్స్లో రికార్డ్ హైకి తక్కువగానే ఉంది. ధరలు భారీగా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు మినహా భౌతిక బంగారానికి డిమాండ్ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 0.3 శాతం పెరిగి 19.89 డాలర్లకు చేరుకుంది. ప్లాటినమ్ 0.1 శాతం పెరిగి 844.40 డాలర్లుగా ఉంది.
బంగారం పరుగులు తగ్గినట్లేనా?
గత కొద్దికాలంగా బంగారం ధరలు జాతీయ, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పరుగులు పెడుతున్నాయి. కరోనాకు ముందు రూ.40వేలకు అటు ఇటుగా ఉన్న ధర ఇప్పుడు రూ.50వేలు దాటింది. ఇప్పుడిప్పుడే బంగారం ధర పెరుగుదల మాత్రమే మందగించింది. మొన్నటి వరకు పరుగులు పెట్టింది. ఇప్పుడు స్వల్పంగా పెరుగుతోంది. పరిస్థితులు ఇలాగే ఉంటే బంగారం పరుగులు తగ్గినట్లేనని నిపుణులు భావిస్తున్నారు.
పెరుగుదలకు ప్రత్యేక కారణాలు
మన దేశంలో బంగారం ధర పెరగడానికి కొన్ని ప్రత్యేక కారణాలూ ఉంటాయి. ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో మనం ముందు ఉంటాం. మన దగ్గర వినియోగానికి తగినంత బంగారం నిల్వలు లేవు. కాబట్టి, బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. కానీ ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే సరుకుల డెలివరీ ఆలస్యమైంది. ధరల పెరుగుదలతో కొనుగోళ్లు కూడా తగ్గాయి. అనేక ఆంక్షలతో దిగుమతులు ప్రభావితమయ్యాయి. ధరల పెరుగుదలకు ఇది కూడా కారణంగా మారిందని అంటున్నారు.
20 శాతం పెరిగిన ధరలు
ఈ ఏడాది న్యూయార్క్ కామెక్స్ మార్కెట్లో బంగారం ధరలు ఔన్స్కు 19.7 శాతం లేదా 300 డాలర్లకు పైగా పెరిగింది. 2011 సెప్టెంబర్లో 1800 డాలర్లకు పైకి చేరుకున్న బంగారం ధరలు ఏడాది చివరి నాటికి 1565 డాలర్లకు పడిపోయాయి. రాబోయే 3 నెలల నుండి 5 నెలల్లో బంగారం ధరలు ఔన్స్ 2,000 డాలర్లకు చేరుకునే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.