5 రోజుల్లో రూ.1600 తగ్గుదల, బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయా?
పసిడి ధరలు మళ్లీ పెరగనున్నాయా? అంటే కొట్టి పారేయలేమని అంటున్నారు. ఇప్పటికే పసిడి ధరలు వచ్చే 12 నెలల కాలంలో దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో రూ.52,000 నుండి రూ.53,000కు చేరుకోవచ్చునని అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ స్థాయికి చేరుకుంటుందని చెబుతున్నారు. అయితే అంతర్జాతీయ పరిణామాలతో సంబంధం లేకుండా దేశీయంగా ధరలు కాస్త పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీఎస్టీ రేట్లను సవరించాలని జీఎస్టీ ఫిట్మెంట్ కమిటీ చేసిన సూచనల్లో బంగారం, వెండిపై ప్రస్తుతం విధిస్తున్న జీఎస్టీ రేటును కూడా పెంచాలని ప్రతిపాదించడం ఇందుకు కారణంగా చెబుతున్నారు.
ఐదు రోజుల్లో రూ.1600 తగ్గుదల
దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు గత ఐదు సెషన్లలో రూ.1600 వరకు తగ్గింది. రూ.49,000కు పైగా ఉన్న పసిడి ధర ఇప్పుడు రూ.47,600 దిగువకు వచ్చింది. వెండి ధరలు కూడా రూ.65,000కు పైన ఉండగా, ఇప్పుడు రూ.63,000 దిగువకు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు 1800 డాలర్ల దిగువకు పడిపోయాయి. సిక్స్ బాస్కెట్ కరెన్సీలో యూఎస్ డాలర్ 0.2 శాతం పెరిగి 16 నెలల గరిష్టాన్ని తాకింది. దీంతో బంగారం ధరలపై ప్రభావం పడుతోంది.
జీఎస్టీ స్లాబ్స్ మార్పు
ప్రస్తుతం అమలులో ఉన్న జీఎస్టీ స్లాబ్స్ రేట్లను సవరించాలని జీఎస్టీ ఫిట్మెంట్ కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న జీఎస్టీ రేటును 7 శాతానికి, 18 శాతంగా ఉన్న స్లాబ్ రేటును 20 శాతానికి పెంచాలని కమిటీ సూచించింది. అలాగే వేర్వేరుగా ఉన్న 12 శాతం, 18 శాతం స్లాబ్ రేట్లను కలిపి 17 శాతం చేయాలనే ప్రతిపాదన చేసింది.
ఇందులో భాగంగా బంగారం, వెండి వస్తువులపై మూడు శాతంగా ఉన్న జీఎస్టీ రేటును 5 శాతానికి పెంచాలని కమిటీ సూచించింది. ఈ కమిటీ ప్రతిపాదనలను కేబినెట్ ఉపసంఘం ఆమోదించిన తర్వాత అమల్లోకి తీసుకు రావొచ్చు.
జీఎస్టీ స్లాబ్ రేట్లు సవరిస్తారనే ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కెబినెట్ ఉపసంఘం నవంబర్ 27వ తేదీన భేటీ కానుంది. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చు. డిసెంబర్ నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం వెలువడవచ్చు.
అమ్మకాలపై ప్రభావం
జీఎస్టీ రేటును సవరించాలనే నిర్ణయంపై బంగారం, వెండి వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్, హాల్ మార్కింగ్ తప్పనిసరి వంటి నిర్ణయాలతో చాలా వరకు వ్యాపారం దెబ్బతిన్నదని, పెళ్లిళ్ల సీజన్ కారణంగా గత రెండు నెలల నుండి మళ్లీ అమ్మకాలు పుంజుకున్నాయని అంటున్నారు. ఇప్పుడు జీఎస్టీ రేట్లు పెంచితే ధరలు పెరిగి అమ్మకాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.