కరోనా టైంలో బంగారు రుణ మార్కెట్ ఎలా ఉందంటే? మళ్లీ పడిపోవచ్చు
కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది ఉద్యోగాలు పోయాయి. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఉద్యోగాల్లో కోత విధించబడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో అవసరాలకు లేదా అత్యవసరాల కోసం డబ్బులు అవసరమైన సమయంలో చాలామంది రుణాల వైపు మొగ్గు చూపారు. కరోనా సమయంలో ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కేందుకు చాలామంది లిక్విడిటీ కోసం తమ చేతుల్లోని బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. దీంతో కరోనా సమయంలో బంగారు రుణ విభాగం పెద్ద ఎత్తున వృద్ధి సాధించింది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం మార్చి 2022తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ లోన్స్ మార్కెట్ 15.7 శాతం వృద్ధి నమోదు చేసి 4.617 ట్రిలియన్ రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. మార్చి 2020తో ముగిసిన సంవత్సరంలో ఇది 3.448 ట్రిలియన్ రూపాయలుగా ఉంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో గత ఏడాది మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికానికి బంగారు రుణాల వృద్ధి రేటు ఏడాది ప్రాతిపదికన 465.08 శాతం ఎగిసి 209.87 బిలియన్ల రూపాయలకు చేరుకుంది. అన్ని బ్యాంకుల్లో గోల్డ్ జ్యువెల్లరీ రుణాలు పెరిగినట్లు ఆర్బీఐ కూడా వెల్లడించింది. జనవరి 2020లో 185.96 బిలియన్ రూపాయలుగా ఉన్న గోల్డ్ జ్యువెల్లరీ రుణాలు మార్చి 2021 నాటికి 604.64 బిలియన్ రూపాయలకు చేరుకున్నట్లు తెలిపింది. జనవరి 2020 నుండి మార్చి 2021 నాటికి గోల్డ్ జ్యువెల్లరీ వృద్ధి రేటు 225.15 శాతం సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది.
2020లో బంగారం రుణాలు 24 శాతం మేర పెరిగినట్లు భారత నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, అండ్ సఈవో వీపీ నందకుమార్ తెలిపారు. కరోనా మహమ్మారి బంగారం రుణ మార్కెట్ను తదుపరి స్థాయికి తీసుకు వెళ్లిందన్నారు. ఇది గోల్డ్ లోన్ మార్కెట్కు కచ్చితంగా సానుకూలమైన అంశమన్నారు. అయితే ప్రజలు తాము దాచిపెట్టుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాన్ని తీసుకోవాల్సి వస్తోందన్నారు. 2020 ఆగస్ట్ నెలలో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయని, ఇప్పుడు బంగారం ధరలు పడిపోతున్నాయని, ఈ నేపథ్యంలో బంగారం రుణాలు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయన్నారు. బంగారు రుణ మార్కెట్ వేగంగా పడిపోవచ్చునని తెలిపారు. అయితే గత ఏడాది కరోనా దెబ్బకు తోడు, బంగారం ర్యాలీ గోల్డ్ లోన్ మార్కెట్ పెరగడానికి సహాయపడిందన్నారు.
బంగారం లేదా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం ద్వారా రుణాన్ని పొందవచ్చు. ఇందులో 8 క్యారెట్ల నుండి 24 క్యారెట్ల బంగారం వరకు తాకట్టుపెట్టవచ్చు. బ్యాంకులు విక్రయించిన గోల్డ్ కాయిన్స్ను కూడా తాకట్టు పెట్టవచ్చును. బంగారం రుణాలు సెక్యూర్డ్ లోన్స్. కాబట్టి వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. బ్యాంకును బట్టి, కాలపరిమితిని బట్టి బంగారం రుణంపై వడ్డీ రేటు 7 శాతం నుండి 29 శాతం వరకు ఉంటాయి. బ్యాంకులు బంగారంపై వడ్డీ రేటును కొన్ని సందర్భాల్లో సవరిస్తాయి. అంతర్జాతీయ బంగారం ధరలు, ఇతర ఎకనమిక్ డెవలప్మెంట్ ఆధారంగా సవరిస్తాయి. బంగారంపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రాయితీలు కూడా ఉంటాయి. ఉదాహరణకు బంగారం రుణ వడ్డీ రేట్ల పైన ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రాయితీలను అందిస్తోంది. ఆభరణాల పైన మాత్రమే కాకుండా, బ్యాంకులు విక్రయించిన గోల్డ్ కాయిన్స్ తాకట్టు పైన కూడా తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు అందిస్తోంది. ముఖ్యంగా ఎస్బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారికి కనిష్టంగా 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా ఈ రుణాలకు అర్హులు.