కరోనా కల్లోలం: మార్కెట్ ఇలాగే ఉంటుందా, స్టాక్స్ కొనుగోలు చేయవచ్చా?
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కూరుకుపోతున్నాయి. కనీవినీ ఎరుగని నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపాదన ఆవిరవుతోంది. గతవారంలో సోమ, గురువారంతో పాటు ఈ వారంలో నిన్న (సోమవారం) భారీ నష్టాలు చవిచూసిన మార్కెట్లు మంగళవారం స్వల్పంగా కోలుకున్నాయి. స్టాక్స్ భారీగా తగ్గినందున ఇప్పుడు కొనుగోలు చేయవచ్చునని కొంతమంది భావిస్తారు. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
2008 తరహా ఆర్థిక సంక్షోభం: మార్కెట్ నష్టాలకు 4 కారణాలు
మార్కెట్ పతనం ఆగిపోయినట్లా?
చిన్న, మధ్య, పెద్ద కంపెనీల షేర్లు ఇప్పుడు భారీగా దిగి వచ్చాయి. ఐనప్పటికీ షేర్లు కొనేందుకు చాలామంది మొగ్గు చూపడం లేదు. మార్కెట్ పతనం ఎంత వరకు ఉంటుందోననే ఆందోళనతో ఈ షేర్లు కొనుగోలు చేయడం లేదు. మార్కెట్ పతనం ఆగిందా.. ఇలాగే ఉంటుందా అంటే ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. కరోనా ప్రభావంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఆపై సౌదీ చమురు ధరల యుద్ధంపై ఆధారపడి ఉంది.
కరోనా ఒక్కటే కాదు..
కరోనా సమస్యకు ముందే ట్రేడ్ వార్, అంతర్జాతీయ మందగమం, తాజాగా సౌదీ అరేబియా - రష్యా చమురు యుద్ధం మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఎమీ చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.
కరోనా నుండి బయటపడినా..
కరోనా సమస్య త్వరలో సద్దుమణిగినప్పటికీ ఆయా దేశాల వృద్ధి డీలాతో ప్రపంచ మార్కెట్లు అంత త్వరగా కోలుకోపోవచ్చుననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపై కూడా ఉంటుంది.
ఇది సానుకూలం..
చమురు ధరలు దిగి రావడం, ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు ఉండటంతో మన మార్కెట్లు కొంత సానుకూలంగా ఉండే అవకాశముందని అంటున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా ఇతర దేశాలతో పోలిస్తే మనపై కరోనా ప్రభావం తక్కువే. కానీ ప్రపంచ మార్కెట్లపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన మార్కెట్లు ఎలా ఉంటాయనేది అప్పుడే చెప్పలేమని అంటున్నారు.
షేర్లు కొనుగోలు చేయవచ్చా..
ఆయా కంపెనీల షేర్లను కొనుగోలు చేయవచ్చా అంటే దీర్ఘకాలానికి అయితే పర్వాలేదు అని చెబుతున్నారు. అయితే ఆచితూచి, నిలకడగా ఉంటుందని భావిస్తేనే కొనుగోలు చేయడం మంచిదని అంటున్నారు. కొన్ని సందర్భాలలో నిలకడగా ఉంటుందనుకునే కంపెనీలు కూడా భారీగా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి.