Yes Bank: మార్కెట్లో దుమ్మురేపుతున్న యెస్ బ్యాంక్ షేర్లు.. కొత్త గరిష్ఠాలకు స్టాక్..
Yes Bank: ఒకప్పుడు వెలిగిన ప్రైవేటు రంగంలోని యెస్ బ్యాంక్ ప్రమోటర్లు చేసిన కొన్ని తప్పుల కారణంగా తీవ్రంగా నష్టపోయింది. బ్యాంక్ పేరు ప్రఖ్యాతలు మసకబారటంతో పాటు స్టాక్ కుప్పకూలటంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. షేర్ విలువ ఆ సమయంలో దారుణంగా పడిపోయింది.
ఊపందుకున్న షేర్స్..
భారతీయ రిజర్వు బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగి యాజమాన్య బాధ్యతలతో పాటు కొత్త పెట్టుబడులు పెట్టడంతో యెస్ బ్యాంక్ మళ్లీ పుంజుకుంటోంది. ఈరోజు మార్కెట్లో 52 వారాల గరిష్ఠానికి చేరుకున్న స్టాక్ రికార్డుల మోత మోగిస్తోంది. స్టాక్ తాజా పెరుగుదల రెండేళ్ల గరిష్ఠ ధర కావటంతో ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహం నెలకొంది.
15 శాతం అప్..
ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో స్టాక్ ఏకంగా 14.93 శాతం పెరిగింది. గతంలో స్టాక్ ఇదే విధంగా భారీగా లాభపడింది. దీంతో స్టాక్ ధర బీఎస్ఈ సూచీలో గత ముగింపు అయిన రూ.17.75 నుంచి రూ.20.40కు చేరుకుంది. ఈ క్రమంలో మెుత్తం 616.23 లక్షల షేర్లు చేతులు మారగా వాటి విలువ రూ.120.47 కోట్లుగా నిలిచింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.50 వేల కోట్లకు చేరుకుంది.
దూకుడుకు కారణం..?
యెస్ బ్యాంక్ రెండు ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవటం, ఇటీవల బ్యాకింగ్ రంగంలోని షేర్లు భారీగా లాభపడటం వంటి కారణాలతో యెస్ బ్యాంక్ స్టాక్ భారీగా లాభపడినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రెగ్యులేటరీ అనుమతులకు లోబడి యెస్ బ్యాంక్లో రూ.8,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని జూలైలో రెండు ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్ ప్రతిపాదించాయి. ప్రైవేట్ ఈక్విటీ మేజర్లు కార్లైల్, అడ్వెంట్ యెస్ బ్యాంక్లో 9.99 శాతం వరకు వాటాను కలిగి ఉండటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలపటం ఇప్పుడు ఇన్వెస్టర్లకు భారీగా కలిసొచ్చింది.
ఆదాయం తగ్గుదల..
యెస్ బ్యాంక్ సెప్టెంబర్ మాసంతో ముగిసిన రెండవ త్రైమాసికంలో రూ.152.82 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.225.5 కోట్లుగా ఉంది. అంటే బ్యాంక్ నికర లాభం ఈ కాలంలో దాదాపుగా 32 శాతం క్షీణించింది. ఎన్ఎస్ఈలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.20.50 ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ.12.10గా ఉంది.