COVID 19: ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు
కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలామంది ఉద్యోగాలు పోయాయి. మరెంతో మందికి వేతనాల్లో కోత పడింది. ఉపాధి అవకాశాలు క్షీణించాయి. దీంతో చాలా కుటుంబాలు బతుకుబండిని వెళ్లదీసేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో 'ఏడీఆర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పీపుల్స్ ఎట్ వర్క్: ఏ గ్లోబల్ వర్క్ ఫోర్స్ వ్యూ' సర్వేలో ఆసక్తిర అంశాలు వెల్లడయ్యాయి. కరోనా కారణంగా ఉద్యోగుల్లో ఆర్థిక, ఉద్యోగ భద్రతపై ఆందోళన పెరిగింది. అదే సమయంలో భవిష్యత్తుపై చాలా సానుకూలంగా ఉన్నట్లు సర్వేలో తేలింది.
95 శాతం మంది ఆందోళన
ఈ సర్వే ప్రకారం 95 శాతం మంది భారతీయులు తమ ఆర్థిక, ఉద్యోగ భద్రతపై ఆందోళనగా ఉన్నారు. దాదాపు అంతే శాతం మంది రానున్న అయిదేళ్ల కాలంలో సానుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 17 దేశాలకు చెందిన 32,471 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. నవంబర్ 17వ తేదీ నుండి డిసెంబర్ 11, 2020 మధ్య ఈ సర్వే నిర్వహించారు.
ఉద్యోగంపై ప్రభావం
కరోనా వల్ల వృత్తిపరంగా ఎంతో కొంత ప్రభావం పడుతోందని 86 శాతం మంది తెలిపారు. ఉద్యోగం పోయే పరిస్థితి ఉందని లేదా తాత్కాలికంగా ఉద్యోగానికి ఇబ్బంది రావొచ్చునని దాదాపు 50 శాతం మంది తెలిపారు. వేతనాల్లో కోత ఉండవచ్చునని 30 శాతం మంది, తమ పనిగంటలు లేదా బాధ్యతలు తగ్గవచ్చునని 25 శాతం మంది తెలిపారు. సిబ్బంది మనసులో నుంచి ప్రతికూలతలను తొలగించి సానుకూలతలను తీసుకురావడానికి హెచ్ఆర్ బృందాలు మార్గాలు అన్వేషిస్తున్నాయి.
మరింత మంచి ఉద్యోగం
ఒకవేళ ఉద్యోగం కోల్పోయినా తమకు సంతృప్తి కలిగే మరో ఉద్యోగం లభిస్తుందని 68 శాతం మంది, మెరుగైన వేతనం రావొచ్చునని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా గత ఏడాది ఏప్రిల్ నుండి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలా ఉద్యోగాలు పోయిన విషయం తెలిసిందే. అయితే రికవరీ నేపథ్యంలో ఇటీవల నియామకాలు పెరుగుతున్నాయి.