సంక్షోభాల్లోకెల్ల సంక్షోభం: చైనా కోలుకున్నా.. ఉత్పత్తులు ఎవరు కొంటారు?
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుపోతోంది. ప్రారంభంలో ఈ వైరస్ ప్రభావం తాత్కాలికమేనని భావించారు. క్రమంగా రోజు రోజుకు కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంటే.. ప్రపంచమంతా దాదాపు లాక్ డౌన్లో ఉన్న నేపథ్యంలో దీర్ఘకాలం ప్రభావం కొనసాగవచ్చునని అంటున్నారు. మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నందున ఆర్థిక వృద్ధికి ఆటంకం ఏర్పడుతోంది.
Covid 19: ఇదీ చైనా ఆర్థిక దుస్థితి, 44 ఏళ్లలో ఇలా జరగలేదు! డ్రాగన్కు 2 సవాళ్లు
అప్పటిదాకా సినిమాలు, రెస్టారెంట్లకు వెళ్లరు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతోంది. మానవుల పరస్పర చర్య ప్రమాదకరమైనంత కాలం వ్యాపారం, ఉత్పత్తి వంటివి సాధారణ స్థితికి రాలేవు. ముందు ముందు ఎలా ఉంటుంది, ఇది ఎంతకాలం ఉంటుందో చెప్పలేని పరిస్థితి. వైరస్ ఉన్నంతకాలం ప్రజలు సమూహాలుగా ఉండలేరు. కచేరీ హాల్స్, రెస్టారెంట్, సినిమాహాల్స్ వంటి వాటికి వెళ్లడానికి వెనుకాడుతారు.
వైరస్ నుండి కోలుకున్నా...
ప్రజలు బయట స్వేచ్ఛగా తిరగనంతకాలం వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోవడం లేదా చాలా చాలా తక్కువగా ఉడటం జరుగుతుంది. అంటే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ.. తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఉంది. కరోనా నుండి ప్రపంచం మరికొద్ది నెలల్లో బయటపడవచ్చు. కానీ దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి మాత్రం సుదీర్ఘకాలమే పట్టవచ్చు.
కుప్పకూలుతున్న మార్కెట్లు
ఇప్పటికే ప్రపంచదేశాల స్టాక్ మార్కెట్లు ఆర్థిక పరిస్థితిని వెల్లడిస్తున్నాయి. మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అమెరికాలోని S&P 500 బుధవారం 4 శాతానికి పైగా నష్టపోయింది. పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో నష్టపోయారు. 2008 అక్టోబర్ తర్వాత మార్కెట్లు అతి భారీ నష్టాన్ని చవి చూస్తున్నాయి. S&P 500 పన్నెండేళ్ల తర్వాత మొదటిసారి 12.5 శాతం పడిపోయింది.
సంక్షోభాల్లోనే అతి పెద్దది
ఇప్పటి వరకు 2008 ఆర్థిక సంక్షోభం గురించి చెప్పుకుంటున్నామని, ప్రస్తుత సంక్షోభంతో పోలిస్తే ఆది తక్కువేనని హార్వార్డ్ ఎకనమిస్ట్ కెన్నెత్ ఎస్ రోగోఫ్ అన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆర్థిక సంక్షోభం సుదీర్ఘంగా ఉండే అవకాశముందని, అప్పుడు ఆర్థిక సంక్షోభాల్లోనే అతిపెద్దది అవుతుందన్నారు. అన్ని ఆర్థిక సంక్షోభాలకు మదర్ వంటిదన్నారు.
అన్నీ తెరుచుకోవాలి
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితి మరింత భయంకరంగా ఉందని, పెట్టుబడులు వెనక్కి తరలి వెళ్తున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరెన్సీ విలువలు క్షీణిస్తున్నాయన్నారు. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తాత్కాలికంగా స్తంభించిపోయినప్పటికీ వైరస్ వ్యాప్తిని అడ్డుకున్న తర్వాత కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ తెరుచుకుంటాయి. ప్రపంచం తిరిగి సాధారణ జీవితంలోకి ఎంత త్వరగా వస్తే అంత మంచిదని అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమలు తిరిగి ప్రారంభం కావాలి. దుకాణాలు తెరుచుకోవాలి.
ఉద్దీపనల ప్రభావం
కానీ, ఇటలీ, స్పెయిన్, అమెరికా వంటి దేశాల్లో మహమ్మారితో కకళావికలమవుతున్నాయి. ప్రభుత్వాలు తప్పనిసరిగా లాక్ డౌన్ ప్రకటించే పరిస్థితులు ఉన్నాయి. సరఫరా గొలుసు తెగిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్వల్ప ప్రభావం పడుతుందని తొలుత ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ అంచనా వేసింది. కానీ భారీగానే సవరించే అవకాశాలున్నాయి. ఆయా ప్రభుత్వాలు ఇచ్చే ఉద్దీపనలపై కూడా ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అంశం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
చైనాలో సద్దుమణిగినా.. వస్తువులు ఎవరు కొంటారు..
ప్రపంచవ్యాప్తంగా విదేశీ పెట్టుబడులు ఈ ఏడాది 40 శాతం మేర తగ్గుతున్నాయని ఐక్య రాజ్య సమితి తెలిపింది. ఇది సరఫరా చైన్కు సుదీర్ఘ నష్టమేనని అంటున్నారు. చాలా ఆర్థిక వ్యవస్థలు తిరిగి గాడిన పడేందుకు మూడేళ్లయినా పట్టవచ్చునని అంటున్నారు. చైనాలో వైరస్ తగ్గి క్రమంగా పుంజుకున్నప్పటికీ అమెరికా ఇంకా మహమ్మారితో పోరాడుతుంటే, సౌతాఫ్రికా ప్రపంచ మార్కెట్ నుండి రుణాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే, యూరప్ మాంద్యంలోకి వెళ్తుంటే.. చైనాలో పరిస్థితి సద్దుమణిగినా ఫలితం లేదని అంటున్నారు. చైనా కోలుకొని మ్యానుఫ్యాక్చరింగ్ తిరిగి ప్రారంభిస్తే అసలు ఎవరికి విక్రయిస్తారని రోగోఫ్ అంటున్నారు.