ఆరేళ్ల గరిష్టానికి బంగారం ధరలు, భారీగా పెరిగిన పెట్రో ధర
హాంగ్కాంగ్: ఇరాన్ - అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడాయిల్, బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వీటి ధరలు సోమవారం నాడు ఆరేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. గత వారం బాగ్ధాద్లో ఇరాక్ టాప్ కమాండర్ను అమెరికా రాకెట్లు హతమార్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో ఆయిల్ ధరలు పెరగడంతో పాటు ఇన్వెస్టర్లు పెట్టుబడుల కోసం సురక్షిత బంగారం వైపు చూస్తున్నారు.
పన్ను చెల్లింపుదారులకు మరో అవకాశం, జనవరి 31 వరకు గడువు
తమ టాప్ కమాండర్ సోలేమని హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని శుక్రవారం ఇరాన్ ప్రకటించింది. దీనిపై ట్రంప్ కూడా తీవ్రంగానే స్పందించారు. అనంతరం అమెరికా కార్యాలయాలు టార్గెట్గా కూడా రాకెట్లు దూసుకొచ్చాయి. మరోసారి ఇలా జరిగితే తాము తీవ్రంగా విరుచుకుపడతామని అమెరికా కూడా హెచ్చరించింది. మరోవైపు, ఇరాక్ను అమెరికా ట్రూప్స్ వదిలి వెళ్లిపోవాలని డిమాండ్లు వచ్చాయి.
ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల్లో చమురు ధరలు పెరగడంతో పాటు బంగారం ధరలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నెల తర్వాత క్రూడాయిల్ ధర మొదటిసారి బ్యారెల్ 70 డాలర్లకు పైకి చేరుకుంది. ఇక బంగారం ఆరేళ్ల గరిష్టానికి చేరుకుంది. 2013 తర్వాత మళ్లీ అంతకు పెరిగాయి. మరోవైపు, జపాన్ యెన్ డాలర్తో మూడు రెట్ల గరిష్టానికి చేరింది.
అంతర్జాతీయంగా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈక్విటీ మార్కెట్ల నష్టాలు ఆసియాకు విస్తరించాయి. టోక్యో 2 శాతం, హాంకాంగ్ 0.7 శాతం, సిడ్నీ 0.4 శాతం నష్టపోయాయి. సింగపూర్ 0.5 శాతం, సియోల్ 1 శాతం, తైపీ 1 శాతం, మనీలా 1.7 శాతం, జకర్తా 0.7 శాతం, షాంఘై 0.3 శాతం నష్టపోయాయి.