ఆ సంకేతాలతోనే మన స్టాక్ మార్కెట్లు పరుగులు!
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం దంచికొట్టాయి. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ సంకేతాలు, బ్లూచిప్స్ కౌంటర్లలో కొనుగోళ్లు.. మన మార్కెట్ను పరుగులు పెట్టించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 428 పాయింట్ల మేర జంప్ చేసి, 41,000 మార్క్కు పైన నిలిచింది. ఇంట్రాడేలో 41,055.80 వద్ద గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్, చివరికి 41,009.71 వద్ద క్లోజైంది.
నిఫ్టీ సైతం 114.90 పాయింట్లు లాభపడి 12,086.70 వద్ద స్థిరపడింది. అమెరికా-చైనాల మధ్య ట్రేడ్ డీల్ సుఖాంతం కాబోతోందనే వార్తలు వెలువడడంతో మదుపరులు కొనుగోళ్లకు దిగారు. బ్రెగ్జిట్ ప్రధానాంశంగా జరిగిన యూకే సాధారణ ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ విజయం సాధించడంతో బ్రెగ్జిట్ ఒప్పందంపై కూడా ఓ స్పష్టత రావడం కలిసొచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు కళకళలాడాయి.
అమెరికా-చైనా ట్రేడ్వార్ క్లోజ్...
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఏడాదిన్నరగా కలవరపెడుతోన్న అమెరికా-చైనా ట్రేడ్వార్ క్లోజ్ అయినట్లే. ఈ రెండు దేశాల మధ్య తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం స్వయంగా ప్రకటించారు. చైనాపై గతంలో ప్రకటించిన జరిమానాలు, సుంకాలను ఉపసంహరిస్తున్నట్లు పేర్కొనడమేకాక రెండో దశ ఒప్పందానికి సంబంధించిన చర్చలను కూడా 2020 ఎన్నికల వరకు వేచి చూడకుండా ప్రారంభిస్తామని కూడా ఆయన ప్రకటించారు. దీంతో మదుపుదారులు కొనుగోళ్లకు దిగడంతో మన స్టాక్ మార్కెట్లతో సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పరుగులుదీశాయి.
యూకే ఎన్నికల్లో కన్జర్వేటివ్స్ ఘన విజయం...
బ్రెగ్జిట్ (యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం) ప్రధాన అంశంగా యూకేలో జరిగిన ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతినిధ్య వహించిన కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో మూడేళ్ళ నుంచి ఆ దేశంలో నెలకొన్ని రాజకీయ స్తబ్ధతకు తెరపడడమేకాక.. బ్రెగ్జిట్ ఒప్పందంపై ఒక స్పష్టత వచ్చింది. శుక్రవారం ఉదయం వరకు వెల్లడైన ఎన్నికల ఫలితాల ప్రకారం, ఒక జిల్లాలో జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడవలసి ఉన్న నేపథ్యంలో, కన్జర్వేటివ్ పార్టీకి 364 స్థానాలు లభించాయి. 2017లో ఆ పార్టీ సాధించిన స్థానాల కన్నా ఈసారి 47 స్థానాలు అధికంగా లభించాయి. ‘అయితే, గియితే, కావచ్చు, కాకపోవచ్చు.. ఇలాంటివేమీ ఉండవని, తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే.. జనవరి 31 నాటికి ‘బ్రెగ్జిట్' అయినట్లేనని ప్రధాని బోరిస్ జాన్సన్ ఘంటాపథంగా చెప్పడం, ప్రజలు కూడా ఆయన పార్టీకి భారీ మెజార్టీ కట్టబెట్టడం చూస్తుంటే.. యూకే ప్రజలంతా బ్రెగ్జిట్ కోరుకుంటున్నట్లుగా స్పష్టమైపోయింది. ఈ ఎన్నికల ప్రభావంతో స్టాక్ మార్కెట్లపై అత్యంత సానుకూలంగా పడింది.
దంచికొట్టిన స్టాక్ మార్కెట్...
గ్లోబల్గా పాజిటివ్ సంకేతాలతో మన స్టాక్ మార్కెట్లు శుక్రవారం దంచికొట్టాయి. సెన్సెక్స్ ఉదయం 40,754.82 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. ఆ తరువాత వరుస కొనుగోళ్ల మద్దతుతో 41,055.80 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. అంతకుముందు ఒక దశలో 40,736.70 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసినా.. చివరికి 428 పాయింట్లు లాభపడి 41,009.71 పాయింట్ల వద్ద సెన్సెక్స్ స్థిరపడింది. అంతర్జాతీయ సూచీల విషయానికొస్తే.. ఆసియా స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. యూరోపియన్ స్టాక్ మార్కెట్లు కూడా ఇదే ధోరణిలో సాగాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువలో ఎలాంటి మార్పు లేకుండా 70.83 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 50 కూడా
114.90 పాయింట్లు లాభపడి 12,086.70 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 50 సూచీ 12,098.85 - 12,023.60 పాయింట్ల మధ్య కదలాడింది.
బ్యాంకు షేర్ల రయ్ రయ్...
సెన్సెక్స్ 30 షేర్లలో 24 షేర్లు లాభాల్లో ముగియగా.. యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్గా 4.21 శాతం ర్యాలీ చేసింది. వేదంతా షేర్లు 3.75 శాతం, ఎస్బీఐ షేర్లు 3.39 శాతం, మారుతీ షేర్లు 3.20 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 3.07 శాతం, యెస్ బ్యాంక్ షేర్లు 2.87 శాతం లాభపడ్డాయి. మన ఆర్థిక వ్యవస్థ అంతగా బాగలేకపోవడంతో మార్కెట్లు వీక్గానే మొదలైనా.. గ్లోబల్గా పాజిటివ్ సంకేతాలు రావడంతో.. మొత్తంమీద వారాంతాన్ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగించింది. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరిన్ని పాజిటివ్ ప్రకటనలు చేస్తారనే ఆశలతో కూడా స్టాక్ మార్కెట్ పరుగులుదీసింది. బీఎస్ఈలో మెటల్, రియాల్టీ, ఐటీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్, టెక్, బ్యాంక్స్, ఫైనాన్స్ సూచీలు బాగా లాభపడ్డాయి.
ఉజ్జీవన్ షేర్లకు రెండో రోజే నష్టాలు...
స్టాక్ మార్కెట్లో బంపర్ బోణితో లిస్ట్ అయిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లకు రెండో రోజే అమ్మకాల తాకిడి తగిలింది. దీంతో లిస్ట్ అయిన రెండో రోజే ఈ షేర్లు నష్టాలు పాలయ్యాయి. గురువారం ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇష్యూ ధర రూ.37కు 57 శాతం ప్రీమియంతో మార్కెట్లో లిస్ట్ అయింది. చివరికి 51 శాతం లాభంతో ముగిసింది. అయితే శుక్రవారం ప్రాఫిట్ బుకింగ్తో ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు సుమారు 7 శాతం మేర తగ్గాయి. బీఎస్ఈలో 6.89 శాతం నష్టపోయిన షేర్లు రూ.52.05 వద్ద క్లోజ్ అయ్యాయి. ఇంట్రాడేలో ఈ షేర్లు 8.49 శాతం పడిపోయి రూ.51.15గా నమోదు అయ్యాయి. ఎన్ఎస్ఈలో కూడా 6 శాతం నష్టంతో రూ.52.55 వద్ద ముగిశాయి. కంపెనీకి చెందిన 27.97 లక్షల షేర్లు బీఎస్ఈలో ట్రేడ్ అవగా, ఎన్ఎస్ఈలో 4 కోట్లకుపైగా షేర్లు ట్రేడింగ్ జరిపాయి.