ఇరాన్ కీలక నిర్ణయం!: 788 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 4 నెలల గరిష్టం
ముంబై: అమెరికా - ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. భారత్లోను మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్తతల కారణంగా ఆయిల్ ధరలు పెరిగాయి. బంగారం ధరలు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. మరోవైపు, ఇన్వెస్టర్లు మార్కెట్ల వైపు దృష్టి సారించడం లేదు. ఎప్పుడేమవుతుందోననే ఆందోళన వెంటాడుతోంది. దీంతో భారత మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి.
సెన్సెక్స్ 788 పాయింట్లు కోల్పోయి 40,676.63 వద్ద, నిఫ్టీ 234 నష్టపోయి 11,974.20 వద్ద ముగిసింది. ఒక్కరోజు భారీగా నష్టపోవడంలో సెన్సెక్స్ నాలుగు నెలల గరిష్టానికి చేరుకుంటే, నిఫ్టీ ఆరు నెలల గరిష్టానికి చేరుకుంది.
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు, పెరుగుతున్న బంగారం, ఆయిల్ ధరలు
ఇరాన్ కీలక కమాండర్ ఖాసీమ్ను అమెరికా రాకెట్ లాంచర్లు హతమార్చడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఇరాన్ అమెరికా కార్యాలయాలు లక్ష్యంగా దాడులు నిర్వహించింది. ఇరాన్, అమెరికాలు పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.
2015లో వివిధ దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందంలోని కీలక నిబంధన నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం నుంచి 2018లో అమెరికా బయటకు వచ్చింది. దీంతో నాటి నుంచి ఇరాన్ కూడా ఒక్కో నిబంధనను అతిక్రమిస్తోంది. ఈ క్రమంలో యూరేనియం నిల్వలు, వాటి శుద్ధిస్థాయిని పెంచుకున్నట్లు ప్రకటించింది. చివరగా యూరేనియం శుద్ధిలో కీలక పాత్ర పోషించే సెంట్రిఫ్యూజ్ల సంఖ్యపై ఉన్న పరిమితిని పక్కన పెట్టినట్లు తాజాగా ప్రకటించింది.
తమ దేశ అణు కార్యక్రమంలో ఎలాంటి పరిమితులు లేవని ఇరాన్ తెలిపింది. తాజా నిర్ణయంతో ఇరాన్ అణు ఒప్పందం నుంచి పూర్తిగా బయటకు వచ్చింది. ఈ చర్య వల్ల యురేనియం శుద్ధి, శుద్ధిస్థాయి, ఎంత మొత్తంలో శుద్ధి చేయాలి, అణు శోధన వంటి అంశాల్లో ఇరాన్ పైన ఇక ఎలాంటి పరిమితులు ఉండవు. అయితే ప్రస్తుతానికి విద్యుత్ ఉత్పత్తి వంటి దేశ సాంకేతిక అవసరాల మేరకు తమ అణు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపింది. అంతర్జాతీయ అణు శక్తి సంఘంతోను కలిసి పని చేస్తామని పేర్కొంది.
అయితే ఇరాన్ నిర్ణయంపై ఇతర భాగస్వామ్య దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా ఆందోళన వ్యక్తం చేశాయి. ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేస్తామని వెల్లడించాయి. 2015 న్యూక్లియర్ డీల్కు కట్టుబడి ఉండాలని ఇరాన్ను ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దేశాలు కోరాయి. కాగా, అంతర్జాతీయ, ఆసియా, భారత మార్కెట్లపై అమెరికా - ఇరాన్ యుద్ధ మేఘాల ప్రభావం భారీగా పడుతోంది.