TCS Q2 results: నికర లాభంలో 7% క్షీణత, రూ.16,000 కోట్ల షేర్ల బైబ్యాక్
భారత దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) బుధవారం 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్) ఫలితాలను ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలపై ప్రభావం పడిన విషయం తెలిసిందే. ఐటీ సర్వీసెస్ ఎగుమతులపై కూడా మహమ్మారి ప్రభావం చూపింది. రెండో త్రైమాసికంలో టీసీఎస్ నికర లాభం 7.05% క్షీణించి రూ.7,475 కోట్లకు తగ్గిది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.8,042 కోట్లు నమోదు చేసింది. టీసీఎస్ మధ్యంతర డివిడెండ్ను రూ.12 ఇవ్వాలని నిర్ణయించింది.
టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఐటీ కంపెనీలపై యాక్సెంచర్ ఎఫెక్ట్! ఎందుకంటే?
కంపెనీ సగటు ఆదాయం ఏడాది ప్రాతిపదికన 4.9 శాతం పెరిగి రూ.8,433 కోట్లకు చేరింది. స్థిర కరెన్సీ పరంగా రెవెన్యూ 3.2 శాతం క్షీణించింది. సెప్టెంబర్ క్వార్టర్లో ఆపరేషనల్ ఏకీకృత ఆదాయం రూ.40,135 కోట్లుగా నమోదయింది. జూన్ త్రైమాసికంలో టీసీఎస్ నికర లాభం 14 శాతం పెరిగి రూ.7,008 కోట్లుగా ఉంది. మధ్యంతర డివిడెండ్ రూ.5ని ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన సెప్టెంబర్ క్వార్టర్లో ఆదాయం రూ.38,977 కోట్ల (FY20) నుండి రూ.40,135 కోట్లకు (FY21)పెరిగింది.
టీసీఎస్ బోర్డు ఈ రోజు సమావేశమైంది. షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. రూ.16,000 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షేర్లను బైబ్యాక్ చేస్తున్న మొదటి ఐటి కంపెనీ టీసీఎస్. అంతకుముందు 2018లో టీసీఎస్ షేర్ల బైబ్యాక్కు వెళ్లింది. కంపెనీ 5,33,33,333 షేర్లను రూ.3,000 వద్ద కొనుగోలు చేస్తుంది. క్లోజింగ్ ధరతో పోలిస్తే 9.59 శాతం ప్రీమియం ఇది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు 10,27,177.79 కోట్ల వద్ద ఉంది. పరిమాణం పరంగా బైబ్యాక్ చేయనున్న షేర్ల వ్యాల్యూ 1.55 శాతం.