క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు
క్రిప్టోకరెన్సీ వ్యాల్యూపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇడియా (RBI) కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్లో ఆర్థిక స్థిరత్వాన్ని క్రిప్టోకరెన్సీలు ప్రభావితం చేసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిపామని, త్వరలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ క్రిప్టోకరెన్సీపై వ్యాఖ్యలు చేశారు. దేశంలో అధికారికంగా డిజిటల్ కరెన్సీ తీసుకురావాలని కేంద్రం యోచిస్తోన్న సమయంలో ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశంలో ప్రయివేటు క్రిప్టో కరెన్సీపై పూర్తిగా నిషేధించి, సొంత డిజిటల్ కరెన్సీ తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సొంతంగా డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు ఆర్బీఐ సిద్ధమని శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. అలా అయితే చైనాలోని ఎలక్ట్రానిక్ యువాన్తో పాటు డిజిటల్ కరెన్సీ ఉన్న ఇతర దేశాల జాబితాలో భారత్ చేరుతుందన్నారు. కానీ ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో స్పష్టత ఇవ్వలేదు.
దేశీయ క్రిప్టో కరెన్సీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్పష్టత ఇవ్వలేమని, ఇందుకోసం కావాల్సిన సాంకేతికత, విధానపరమైన అంశాలపై ఆర్బీఐ పని చేస్తోందన్నారు. బిట్కాయిన్ వ్యాల్యూ ఎన్నడూ లేనంతగా ఇటీవల పెరగడంతో క్రిప్టోకరెన్సీకి ఆదరణ పెరిగింది. నోట్ల రద్దు తర్వాత దేశీయంగానూ ఈ తరహా కరెన్సీ వినియోగం ఎక్కువ అయింది. ఈ నేపథ్యంలో ప్రయివేటు క్రిప్టోకరెన్సీ వినియోగం శ్రేయస్కరం కాదని భావించిన ఆర్బీఐ, 2018లో నిషేధించింది. అయితే, ఆర్బీఐ ఉత్తర్వులను సుప్రీంకోర్టు 2020లో కొట్టివేసింది. ఇప్పుడు కేంద్రం ప్రయివేటు క్రిప్టోకరెన్సీకి చెక్ చెప్పి, సొంతంగా డిజిటల్ కరెన్సీని తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.