నష్టాల నుండి భారీ లాభాల్లోకి మార్కెట్లు: రిలయన్స్, టైటాన్ 4% జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (అక్టోబర్ 7) నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత కాసేపటికి భారీ లాభాల్లోకి వచ్చాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 23.59 పాయింట్లు(0.06%) నష్టంతో 39,550.98 వద్ద, నిఫ్టీ 1.50 పాయింట్లు(0.01%) నష్టంతో 11,660.90 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రారంభంలో 475 షేర్లు లాభాల్లో, 514 షేర్లు నష్టాల్లో, 57 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
బ్యాంకింగ్, ఆటో, ఇన్ఫ్రా, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొనుగోళ్లు పెరిగాయి. ఐటీ, మెటల్, ఫార్మా రంగాలు స్వల్పంగా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత సెన్సెక్స్ 300 పాయింట్ల లాభాల్లోకి, నిఫ్టీ 75 పాయింట్ల లాభాల్లోకి వచ్చి, 11,750 పాయింట్లకు చేరుకుంది. డాలర్ మారకంతో రూపాయి 73.51 వద్ద ప్రారంభమైంది. నిన్న 73.46 వద్ద క్లోజ్ అయింది.
SBI భారీ ఆఫర్: నెలకు రూ.1 లక్ష, దరఖాస్తుకు ఎల్లుండి ఆఖరి తేదీ
అందుకే లాభాల్లోకి మార్కెట్లు
టైటాన్ కంపెనీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, యూపీఎల్, హీరో మోటో కార్ప్, మారుతీ సుజుకీ భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. టైటాన్, రిలయన్స్ 3-4 శాతానికి పైగా లాభపడింది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, కోల్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంకులు భారీ లాభాల్లో ప్రారంభించాయి. బజాజ్ ఫైనాన్స్ 3 శాతానికి పైగా నష్టాలు చూసింది. యాక్టివ్ స్టాక్స్లో రిలయన్స్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్డీఎప్సీ ఉన్నాయి.
ఉద్దీపన పథకంపై చర్చలకు ప్రస్తుతానికి స్వస్తీ చెప్పనున్నట్లు ప్రకటించిన ట్రంప్ వార్త వంటివి ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపిందని అంటున్నారు.
ఐటీ స్టాక్స్ డల్, ఆటో అప్
ఈరోజు టీసీఎస్ మూడో క్వార్టర్ ఫలితాలు ప్రకటించనుంది. రూ.20వేల కోట్ల బైబ్యాక్ షేర్లపై నిర్ణయం తీసుకోనుంది. టీసీఎస్ ఫలితాలు సానుకూలంగా ఉండటంతో పాటు బైబ్యాక్ వార్తల నేపథ్యంలో లాభాలతో ప్రారంభమైంది. టీసీఎస్ షేర్ మినహా మిగతా ఐటీ స్టాక్స్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.
నిఫ్టీ ఆటో దాదాపు 1 శాతం మేర లాభపడింది. భారత్ ఫోర్జ్, మదర్ సుమి, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటో, బజాజ్ ఆటో, ఐచర్, బాష్, అశోక్ లేలాంట్, అమర్ రాజా బ్యాటరీ, ఎంఆర్ఎఫ్ లాభాల్లో ఉన్నాయి. టీవీఎస్ మోటార్స్, టాటా మోటార్స్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.
బంధన్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, ఐసీఐసీఐ లాభాల్లో ఉన్నాయి. ఈ బ్యాంకులు ఉద్యోగుల వేతన పెంపు భరోసా, బ్యాంకు మూలధనం అంశంలో ధీమా కల్పించడం కూడా స్టాక్స్ పైన ప్రభావం చూపింది.
రిలయన్స్, టైటాన్ అదుర్స్
రిలయన్స్లోకి పెట్టుబడులు వెల్లువెత్తడంతో రిలయన్స్ షేర్ ధర 4.34 శాతానికి పైగా ఎగిసి రూ.2,306 పలికింది. టైటాన్ షేర్ ధర కూడా 4 శాతానికి పైగా లాభపడింది.
నిఫ్టీ ఆటో 0.27 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.44 శాతం, నిఫ్టీ ఫార్మా 0.13 శాతం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ బ్యాంకు ప్రారంభంలో స్వల్ప నష్టాలతో ప్రారంభమైన లాభాల్లోకి వెళ్లింది.