ఆర్బీఐ వడ్డీ రేటు ప్రకటన తర్వాత భారీ లాభాల్లోకి మార్కెట్లు, ఆ తర్వాత డౌన్
స్టాక్ మార్కెట్లు శుక్రవారం(అక్టోబర్ 8) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పాలసీ సమావేశం నిర్ణయాల అనంతరం సూచీలు పరుగులు పెట్టాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 60,200 కూడా క్రాస్ చేసింది. ఉదయం గం.11.30 సమయానికి సెన్సెక్స్ ఉదయం 59,960.39 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,212.30 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,830.93 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,886.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,941.85 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,848.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
మధ్యాహ్నం గం.11.45 సమయానికి సెన్సెక్స్ 458.55 (0.77%) పాయింట్లు లాభపడి 60,142.53 పాయింట్ల వద్ద, నిఫ్టీ 134.10 (0.75%) పాయింట్లు ఎగిసి 17,924.45 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం గం.12.30 సమయానికి 265 పాయింట్లు లాభపడి 59,927 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
ఆర్బీఐ పాలసీ ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా కదలాడారు. శక్తికాంతదాస్ ప్రకటనకు ముందు 60,000 దిగువన ఉన్న సెన్సెక్స్ ఆర్బీఐ వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత 60,200 స్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, రిలయన్స్, టెక్ మహీంద్రా, టాప్ లూజర్స్ జాబితాలో ఎన్టీపీసీ, కోల్ ఇండియా, దివిస్ ల్యాబ్స్, HUL, మారుతీ సుజుకీ నష్టపోయాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వడ్డీ రేటును స్థిరంగా కొనసాగించింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ బుధవారం నుండి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు సమావేశమై, కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీకి సంబంధించిన వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేడు (శుక్రవారం, అక్టోబర్ 8) మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా రివర్స్ రెపో రేటును, రెపో రేటును స్థిరంగా కొనసాగించింది. వరుసగా ఎనిమిదో సారి రెపో రేటును 4 శాతంగా, రివర్స్ రెపో రేటును 3.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు శక్తికాంతదాస్ తెలిపారు. వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగించేందుకు 5-1 ఓట్లు పడ్డాయి. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారు.