రిలయన్స్ ఎఫెక్ట్: ఒక్కరోజులో రూ.2.26 లక్షల కోట్లు పెరిగిన వారి సంపద!
ముంబై: బ్లూచిప్ కంపెనీల్లో గత రెండు రోజులుగా భారీగా నష్టపోయిన ఇన్వెస్టర్లు, నేడు (గురువారం, సెప్టెంబర్ 10) రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా ఆ రెండు రోజుల నష్టం కంటే ఎక్కువగా తిరిగి పొందారు. ఈరోజు సెన్సెక్స్ 646 పాయింట్లు లేదా 1.69 శాతం లాభంతో 38,840.32 వద్ద, నిఫ్టీ 171 పాయింట్లు లేదా 1.52 శాతం లాభంతో 11,449.25 పాయింట్లతో భారీ లాభాల్లో ముగిశాయి. మూడింట రెండొంతుల లాభాలు రిలయన్స్ వల్లే వచ్చాయి. జియో ప్లాట్ఫాంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్లు రిలయన్స్ రిటైల్లోకి కూడా వస్తాయని.. వస్తున్నాయని భావిస్తున్న నేపథ్యంలో మార్కెట్లు పుంజుకున్నాయి.
ఆర్ఐఎల్కు తోడు అంతర్జాతీయ మార్కెట్ల ఎఫెక్ట్
30 షేర్ ప్యాక్ సెన్సెక్స్ 646 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 171 పాయింట్లు ఎగిసింది. ఇండియన్ సూచీలకు ఈ రోజు రిలయన్స్ బలమైన మద్దతు ఇచ్చిందని, నిఫ్టీలో సగానికి పైగా లాభం ఈ కంపెనీ వల్లేనని, రిలయన్స్ రిటైల్ వాటాలకు తోడు, అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల దృక్పథం కూడా కలిసి వచ్చిందని చెబుతున్నారు. ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. జపాన్ నిక్కీ 0.9 శాతం, చైనా బ్లూ చిప్స్ 0.8 శాతం మేర ఎగిశాయి. రిలయన్స్ షేర్లు 7 శాతానికి పైగా ఎగబాకి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 200 బిలియన్ డాలర్లుగా నిలిచింది. రిలయన్స్ రిటైల్లో వాటాల అమ్మకం ద్వారా రూ.60వేల కోట్ల నుండి రూ.65వేల కోట్లు సమీకరించనుందని వార్తలు వస్తున్నాయి.
రూ.2.26 లక్షల కోట్లు ఎగిసిన సంపద
నేడు మార్కెట్లు భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద ఈ ఒక్కరోజే రూ.2.26 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇందులో రూ.1 లక్ష కోట్లకు పైగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సంపద పెరిగింది. ఇన్వెస్టర్ల సంపద రెండు లక్షలకోట్ల రూపాయలకు పైగా పెరగడంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.155.27 లక్షల కోట్లకు చేరుకుంది.
1821 షేర్లు లాభాల్లో..
నేడు 1,821 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. 889 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 109 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. ఇందులో ఎక్కువగా స్మాల్ క్యాప్ షేర్లు ఉన్నాయి. అదే సమయంలో 58 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. ఇందులో మైక్రోక్యాప్ స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి. 300 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్ లిమిట్లో ముగిశాయి. 205 షేర్లు లోయర్ సర్క్యూట్ లిమిట్లో ముగిశాయి.