బడ్జెట్, ఇన్వెస్టర్ల ఆందోళన: 4 రోజుల్లో 2400 పాయింట్లు, రూ.8 లక్షల కోట్లు ఆవిరి
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (జనవరి 28) భారీ నష్టాల్లో ముగిశాయి. గత గురువారం సెషన్లో సెన్సెక్స్ 50,000 మార్కును దాటినప్పటికీ దానిని నిలుపుకోలేక నష్టాల్లో ముగిసింది. నాటి నుండి వరుసగా నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 2400 పాయింట్ల మేర నష్టపోయింది. నిన్న సెన్సెక్స్ 937 పాయింట్ల మేర నష్టపోయింది. డిసెంబర్ 21 తర్వాత అతి పెద్ద నష్టం ఇదే. 2021లో వచ్చిన లాభాలు అన్నీ కేవలం ఈ నాలుగు సెషన్లలోనే పోయాయి.
2021లో భారత్ అదరగొడుతుంది! ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి చీఫ్ ఎకనమిస్ట్ హెచ్చరిక
రూ.8 లక్షల కోట్లు ఫట్
గత నాలుగు సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.8 లక్షల కోట్లు హరించుకు పోయింది. ఈ కాలంలో సెన్సెక్స్ 2,382 పాయింట్లు లేదా 4.78 శాతం నష్టపోయింది. దీంతో బీఎస్ఈ లిస్టింగ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,07,025.09 కోట్లు కరిగిపోయి రూ.1,89,63,547.48 కోట్లకు తగ్గింది. డెరివేటివ్ కాంట్రాక్ట్ గడువు ముగియడంతో ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా అమ్మకాలకు మొగ్గు చూపుతారని, వచ్చేవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పైన ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోందని చెబుతున్నారు.
2021లో నష్టాల్లోకి..
ఇన్వెస్టర్ల సంపద నిన్న ఒక్కరోజు రూ.2.6 లక్షల కోట్లు హరించుకుపోయింది. నిన్న 938 పాయింట్లు, వరుసగా నాలుగు రోజుల్లో 2400 పాయింట్ల వరకు సెన్సెక్స్ నష్టపోవడంతో 2021లో సూచీలు నష్టాల్లోకి వెళ్లినట్లయింది. బ్యాంకింగ్, ఆటో, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో వరుసగా నాలుగో రోజు సూచీలు ఈ ఏడాది ప్రారంభం కంటే దిగువకు పడిపోయాయి.
ఇన్వెస్టర్ల ఆందోళన
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈసారి బడ్జెట్లో అధిక పన్ను విధింపు ఆస్కారం ఉందనే అంచనాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. బడ్జెట్ తర్వాత కొనుగోళ్ల కోసం కొంత మొత్తం చేతిలో ఉంటే మంచిదని భావిస్తున్న ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారి చెబుతున్నారు. గత పదేళ్ల కాలంలో కేవలం మూడుసార్లు మాత్రమే బడ్జెట్ ఈక్విటీ మార్కెట్ను మెప్పించింది.