కరోనా కేసుల ఎఫెక్ట్, భారీ నష్టాల నుండి స్వల్ప నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (మార్చి 22) నష్టాలతో ప్రారంభమైయ్యాయి. గతవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన మార్కెట్లు, ఈ వారం కూడా అదే బాటలో కనిపిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు గతవారం మిశ్రమంగా ముగిశాయి. ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి. బాండ్స్ ప్రతిఫలాలు స్థిరపడడం, ఐరోపా దేశాలతో పాటు దేశీయంగా మరోసారి కరోనా కేసులు పెరగడం మార్కెట్ల పైన ప్రభావం చూపుతున్నాయి. కీలక బ్యాంకింగ్, ఆర్థికరంగ షేర్లు డీలా పడ్డాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
చైనాలో గూఢచర్యం.. టెస్లాను మూసివేస్తామన్న ఎలాన్ మస్క్
సెన్సెక్స్ 400 పాయింట్లు డౌన్
సెన్సెక్స్ 49,878.77 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,878.77 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,460.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 14,736.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,763.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,644.95 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఓ సమయంలో సెన్సెక్స్ 400 పాయింట్ల మేర పతనమైంది. ఆ తర్వాత స్వల్పంగా కోలుకుంది. అయినప్పటికీ నష్టాల్లోనే ఉంది. ఉదయం గం.10.18 సమయానికి సెన్సెక్స్ 150.13 (0.30%) పాయింట్లు నష్టపోయి 49,708.11 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 22.10 (0.15%) పాయింట్లు క్షీణించి 14,719.25 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టాటా మోటార్స్, రిలయన్స్, టాటా స్టీల్,బజాజ్ ఫైనాన్స్, ICICI బ్యాంకు ఉన్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో సిప్లా 2.02 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.70 శాతం, బీపీసీఎల్ 1.79 శాతం, సన్ ఫార్మా 1.44 శాతం, టాటా స్టీల్ 1.34 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 1.79 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.59 శాతం, రిలయన్స్ 1.54 శాతం, టాటా మోటార్స్ 1.17 శాతం, HDFC బ్యాంకు 1.02 శాతం నష్టపోయాయి.
రంగాలవారీగా
నిఫ్టీ 50 స్టాక్స్ 0.29 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 0.31 శాతం లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ ఆటో 0.13 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.60 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.01 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.49 శాతం, నిఫ్టీ మీడియా 0.57 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.76 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.13 శాతం, నిఫ్టీ ఐటీ 0.51 శాతం, నిఫ్టీ మెటల్ 0.52 శాతం, నిఫ్టీ ఫార్మా 1.19 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.09 శాతం లాభపడ్డాయి.